ఉపాధి హామీ లేదు!
ABN , First Publish Date - 2021-07-29T06:49:21+05:30 IST
స్థానికంగా పనులు కల్పించి, గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టాలని, పేదలకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కొవిడ్ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన ఎంతోమంది యువతకు ఈ పథకం అండగా నిలిచింది.
ఆరు వారాలుగా అందని కూలి సొమ్ము
రూ.4.51 కోట్లకు పైగా బకాయిలు
తుని,
జూలై 28: స్థానికంగా పనులు కల్పించి, గ్రామీణ ప్రాంతాల్లో వలసలను
అరికట్టాలని, పేదలకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉపాధి హామీ
పథకాన్ని ప్రవేశపెట్టారు. కొవిడ్ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన ఎంతోమంది
యువతకు ఈ పథకం అండగా నిలిచింది. జిల్లాలోని మెట్ట ప్రాంత ప్రజల్లో ఉపాధి
పనులపై ఆధారపడి జీవించే వారు చాలా ఎక్కువ. చాలా మంది రైతులు సైతం దీని
ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇదివరకు పనులు జరిగిన ఒకట్రెండు వారాల్లో
కూలీల ఖాతాల్లో నగదు జమ చేసేవారు. ప్రస్తుతం ఆరు వారాలకు సంబంధించిన
వేతనాలు అందకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులకు
వెళ్లినా బిల్లులు చెల్లించకపోవడడంతో ఇళ్లు గడవడం కోసం చాలా మంది అప్పులు
చేయాల్సి వస్తోంది. జిల్లాలో నిత్యం సుమారు 52వేల మంది కూలీలు పనులకు
వెళ్తారు. పనులు, దిన కూలి వివరాలను ప్రతీవారం మండల కార్యాలయానికి
పంపుతారు. వాటిని ప్రతి సోమవారం ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత
ఒకటి, రెండు రోజుల్లో కూలీల ఖాతాల్లో నగదు జమవుతుంది. తాజాగా నిధులు విడుదల
కాకపోవడంతో జూన్ 10వ తేదీ నుంచి సొమ్ములు జమ కాలేదు. వీరికి మొత్తం
రూ.4.51 కోట్లకు పైగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు సకాలంలో
అందకపోవడంతో ఎక్కువ మంది కూలీలు ప్రత్యామ్నాయం వైపు మొగ్గుచూపుతున్నారు.
ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వారంతా పొలం పనులకు
వెళ్తున్నారు. మరికొంతమంది చుట్టపక్కల ప్రాంతాల్లో కూలి పనులకు
వెళ్తున్నారు. మెట్టలో కొందరు జీడిపిక్కల ఫ్యాక్టరీలకు, వ్యవసాయ పనులకు
వెళ్తున్నారు. ఏ రోజు కూలి ఆ రోజు రావడంతో అటువైపు ఆసక్తి చూపుతున్నారు.
లాక్డౌన్ కారణంగా స్వగ్రామాల కు చేరుకుని ఉపాధి పనులు చేస్తున్న కొందరు
దానిని ఎత్తివేయడంతో మళ్లీ నగరాల బాట పడుతున్నారు.