మండలాల్లోనూ ప్రారంభమైన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-21T05:29:34+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు కేంద్రాల సంఖ్యను జిల్లాలో 29 నుంచి 66కు పెంచారు.

మండలాల్లోనూ ప్రారంభమైన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

 అయినా 44 శాతం మందికే టీకా

చిత్తూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు కేంద్రాల సంఖ్యను జిల్లాలో 29 నుంచి 66కు పెంచారు. ఇలా పెంచితే వ్యాక్సిన్‌ వేసుకునేవారి శాతం పెరుగుతుందని అధికారులు ఆశించినా.. పెద్దగా ఫలితం కనిపించలేదు. బుధవారం 6948 మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు షెడ్యూల్‌ చేయగా.. 3063 మంది మాత్రమే ముందుకొచ్చారు. అంటే 44 శాతమే టీకా వేసుకున్నారు. గత శనివారం 29 కేంద్రాల్లో ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా ఐదు రోజుల్లో 16,984 మందికిగానూ 8262 మంది (48.6 శాతం) మాత్రమే వ్యాక్సిన్‌ వేసుకున్నారు. టి.చవటపల్లె, తుంబకుప్పం పీహెచ్‌సీల పరిధిలో ఎవరూ వ్యాక్సిన్‌ వేసుకోలేదు. శ్రీకాళహస్తి, మదనపల్లె వంటి ప్రాంతాల్లో షెడ్యూల్‌ చేసినవారి కంటే అధికంగా వ్యాక్సిన్‌ వేశారు. భయాందోళన, వేచి చూసే ధోరణి వంటి కారణాలతో వ్యాక్సినేషన్‌కు గైర్హాజరు అవుతున్న విషయం తెలిసిందే. బుధవారం రామకుప్పం, వరదయ్యపాళెం, పలమనేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు షెడ్యూల్‌ తర్వాత వ్యక్తిగత కారణాలతో చనిపోవడంతో వ్యాక్సిన్‌ వేయలేకపోయారు.

Updated Date - 2021-01-21T05:29:34+05:30 IST