టీకా స్లిప్పుల పంపిణీ అస్తవ్యస్తం
ABN , First Publish Date - 2021-05-18T06:28:38+05:30 IST
ఒంగోలులో కొవాగ్జిన్ రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. రెండురోజుల నుంచి స్లిప్పులు ఇచ్చి టీకాలు వేస్తున్నట్లు అధికారులు చెప్తున్నా.. ఆ స్లిప్పులు ఏ సచివాలయ పరిధిలో ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక సచివాలయం పరిధిలో ఉండే వ్యక్తులకు అదే సచివాలయ పరిధిలో సెకండ్ డోసు వేయించుకునేందుకు స్లిప్పులు ఇవ్వాల్సి ఉంది.
ఒంగోలులో పరిస్థితి మరింత దారుణం
కనీసం సమాధానం కూడా చెప్పని పరిస్థితి
ఒంగోలు(కలెక్టరేట్), మే 17 : ఒంగోలులో కొవాగ్జిన్ రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. రెండురోజుల నుంచి స్లిప్పులు ఇచ్చి టీకాలు వేస్తున్నట్లు అధికారులు చెప్తున్నా.. ఆ స్లిప్పులు ఏ సచివాలయ పరిధిలో ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక సచివాలయం పరిధిలో ఉండే వ్యక్తులకు అదే సచివాలయ పరిధిలో సెకండ్ డోసు వేయించుకునేందుకు స్లిప్పులు ఇవ్వాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండే సచివాలయాలకు ఇస్తుండటంతో ప్రజానీకం ఆ ప్రాంతానికి పరుగులు తీయాల్సి వస్తోంది.
సెకండ్ డోసు కోసం పరుగులు
ఎంతదూరంలో స్లిప్పులు ఇస్తున్నా సరే సెకండ్డోసు వేయించుకోవాల్సిన వారు అక్కడకు పరుగులు పెడుతున్నారు. ఇప్పుడుపోతే మరలా ఉంటుందో, ఉండోదనన్న ఆందోళనతో కర్ఫ్యూ సమయంలోనూ అవస్థల పడి ఆయా సెంటర్లకు వెళుతున్నారు. ఒంగోలులోని హౌసింగ్బోర్డు కాలనీ వారికి సెకండ్ డోసు వేయించుకునేందుకు స్లిప్పులు ఆ ప్రాంతంలోనే ఇవ్వాలి. కానీ కొంత మందికి త్రోవగుంట, మరికొంతమందికి శివప్రసాద్ కాలనీ సచివాలయానికి స్లిప్పులు ఇచ్చారు. గాంధీనగర్కు చెందిన వ్యక్తుల స్లిప్పులను సమతానగర్ ఇలా దూరప్రాంతాల్లో ఇస్తుండటంతో తెచ్చుకునేందుకు ప్రజానీకం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్లిప్పులకు ఫోన్లు ఎప్పుడు చేస్తున్నారంటే....
సాధారణంగా సెకండ్ డోసు వేయించుకునే వారికి టీకా వేయించుకునే ముందు రోజు స్లిప్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ స్లిప్పులు తీసుకోవాలని హెల్త్వర్కర్ల నుంచి సాయంత్రం పూట ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుండగా ఆ సమయంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితులు తెలిసి కూడా ఉదయం పూట కాకుండా సాయంత్రం సమయంలో ఫోన్లు చేస్తుండటం గమనార్హం.