గజ్వేల్‌ రైతులకు ఇక కష్టాలుండవ్‌: వంటేరు ప్రతాప్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-05-27T18:09:27+05:30 IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ రైతులకు ఇకపై సాగునీటి కష్టాలుండవని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల

గజ్వేల్‌ రైతులకు ఇక కష్టాలుండవ్‌: వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ రైతులకు ఇకపై  సాగునీటి కష్టాలుండవని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ ఈఇన్‌సీ హరిరాం, ఎస్‌ఈ వేణులతో కలసి మర్కుక్‌ మండలం చేబర్తి గ్రామ శివార్లలోని కాళేశ్వరం కాలువ ద్వారా చేబర్తి చెరువుకు 56 క్యూసెక్కుల నీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా సాగునీటి కాలువలోకి దిగి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, ఎక్కడైనా పై నుంచి కిందకి నీరు పోతుంది కానీ కింద  నుంచి 600 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైందే నీటికోసమని, గజ్వేల్‌ ప్రజల సాగు నీటిగోస తీర్చిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనమన్నారు. కేసీఆర్‌కు ఈ ప్రాంతం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఈనెల 29న కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని కేసీఆర్‌ విడుదల చేయనున్నారని, ఈప్రాంతంలో భూగర్భజలాలు కనివిని ఎరుగని రీతిలో పెరుగనున్నాయని చెప్పారు.  కార్యక్రమంలో వారి వెంట ఎంపీపీలు పాండుగౌడ్‌, అమరావతి, జడ్పీటీసీలు ఎంబరి మంగమ్మ, మల్లేశం, పీఏసీఎస్‌ చైర్మన్లు ఇంద్రసేనారెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ యాదవరెడ్డి, సిం గం సత్తయ్య, మాదాసు శ్రీనివాస్‌, కరుణాకర్‌ రెడ్డి, చేబర్తి సర్పంచ్‌ అశోక్‌, మర్కుక్‌ సర్పంచ్‌ భాస్కర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-05-27T18:09:27+05:30 IST