HYD : చోరీకి ముందు ఈ దొంగలు చేసిన పనేంటో తెలిసి విస్తుపోతున్న స్థానికులు..!
ABN , First Publish Date - 2022-01-09T12:59:53+05:30 IST
వీరు అందరిలా కాదు.. వెరైటీ దొంగలు. వచ్చిన పని కానివ్వడంతోపాటు...
- పాలు వేడిచేసుకుని తాగి.. చోరీ
- నగదు బంగారు, వెండి ఆభరణాల అపహరణ
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : వీరు అందరిలా కాదు.. వెరైటీ దొంగలు. వచ్చిన పని కానివ్వడంతోపాటు ఆ ఇంట్లో ఏమున్నా ఆరగించి మరీ వెళ్తారు. శుక్రవారం రాత్రి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఓ దొంగతనం జరిగింది. పెళ్లి కోసం బీరువాలో దాచిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును దొంగలు దోచుకు వెళ్లారు. ఫ్రిజ్లో ఉన్న పాలను వేడిచేసుకుని మరీ తాగి వెళ్లారు. అంత తాపీగా దొంగతనం జరిగిన విషయం తెలిసి స్థానికులు విస్తుపోతున్నారు.
ఎల్లమ్మబండలో నివసిస్తున్న పి.పద్మకు ఇద్దరు కూతుళ్లు. మెహిదీపట్నంలో ఉండే పెద్ద కూతురు కుమారుడు పుట్టినరోజు ఉండటంతో శుక్రవారం ఉదయం కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లింది. శనివారం ఉదయం 9గంటలకు తిరిగి వచ్చిన వీరికి ఇంటి తాళాలుపగలగొట్టి ఉండటం కనిపించింది. ఇంట్లోకి వెళ్లగా బీరువా పగులగొట్టి అందులోని 8తులాల బంగారం, 30తులాల వెండి, 20వేల నగదు ఎత్తుకెళ్లారు. బిడ్డ పెళ్లికోసం దాచుకున్న సొత్తు చోరీ కావడంతో బాధితురాలు బోరున విలపించింది. జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు క్లూస్టీంతోవచ్చి వేలి ముద్రలు తీసుకున్నారు. పాలను వేడిచేసుకుని మరీ తాగి వెళ్లడంతో దొంగలు ఎంత చేపు ఇంట్లో ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.