క్వాడ్‌కు స్ఫూర్తి వసుధైక కుటుంబం : మోదీ

ABN , First Publish Date - 2021-03-13T02:22:26+05:30 IST

క్వాడ్ దేశాల గ్రూప్‌ పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుందని

క్వాడ్‌కు స్ఫూర్తి వసుధైక కుటుంబం : మోదీ

న్యూఢిల్లీ : క్వాడ్ దేశాల గ్రూప్‌ పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుందని, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరతకు ముఖ్యమైన ఆధారంగా నిలుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజాస్వామిక విలువలు, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ కోసం అంకితభావం భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లను సంఘటితపరుస్తున్నాయని చెప్పారు. 


శుక్రవారం జరిగిన తొలి క్వాడ్ దేశాల వర్చువల్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి సుగ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత, అరమరికలు లేని, సమ్మిళిత ఇండో-పసిఫిక్‌ కోసం చిత్తశుద్ధి, ప్రజాస్వామిక విలువలు మనల్ని సంఘటిత పరిచాయని చెప్పారు. క్వాడ్ దేశాల గ్రూప్‌నకు పరిపూర్ణ రూపం వచ్చిందని, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరతకు ముఖ్యమైన ఆధారంగా నిలుస్తోందని తెలిపారు. 


ఈ సానుకూల దృక్పథానికి మూలాలు వసుధైక కుటుంబం అనే ప్రాచీన భారతీయ తత్వంలో ఉందని చెప్పారు. వసుధైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబమని వివరించారు. మనమంతా కలిసి పని చేద్దామని, ఉమ్మడి విలువలను సమగ్రంగా అమలు చేసేందుకు మునుపెన్నడూ లేనంత సన్నిహితంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సురక్షితమైన, సుస్థిరమైన, సౌభాగ్యవంతమైన ఇండో-పసిఫిక్ కోసం సమైక్యంగా కృషి చేద్దామన్నారు. 


చట్టాలకు లోబడి... : బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ, క్వాడ్ దేశాలతోనూ, మిత్ర దేశాలతోనూ కలిసి ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరత కోసం కృషి చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సహకారానికి అత్యంత ముఖ్యమైన వేదికగా క్వాడ్ నిలవబోతోందన్నారు. ప్రధానంగా ఆచరణాత్మక పరిష్కారాలు, కచ్చితమైన ఫలితాలపై క్వాడ్ దేశాల గ్రూప్ దృష్టి సారించిందని, అందువల్ల ఇది చాలా ముఖ్యమైనదని తెలిపారు. ప్రపంచానికి ప్రయోజనకరమైన వ్యాక్సిన్ తయారీని బలోపేతం చేయడానికి వీలుగా సరికొత్త ఉమ్మడి భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. మొత్తం ఇండో-పసిఫిక్‌‌ ప్రాంతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పటిష్టపరిచేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా ఆధిపత్య ధోరణిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘‘మనకు మన కర్తవ్యాలు తెలుసు. మన ప్రాంతం అంతర్జాతీయ చట్టాలకు, అన్ని సార్వజనీన విలువలకు, నిర్బంధాలు లేని పరిస్థితులకు కట్టుబడి ఉంది, అయితే మన భవిష్యత్తుపట్ల నేను ఆశాభావంతో ఉన్నాను’’ అన్నారు. వ్యాక్సిన్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది సార్వత్రిక చట్టాలకు లోబడి ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో క్వాడ్ దేశాల గ్రూప్ చాలా ముఖ్యమైనది కాబోతోందని చెప్పారు. 


21వ శతాబ్దంలో... : మారిసన్

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ మాట్లాడుతూ, 21వ శతాబ్దంలో ప్రపంచ గతిని రూపుదిద్దేది ఇండో-పసిఫిక్ అని చెప్పారు. గొప్ప ప్రజాస్వామిక దేశాల నేతలుగా మన భాగస్వామ్యం శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధన కోసం ఈ ప్రాంతంలోని అనేక దేశాలను కలుపుకొనిపోవాలన్నారు. 


స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ : సుగ

జపాన్ ప్రధాన మంత్రి యొషిహిడె సుగ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ఆసక్తిని క్వాడ్ పంచుకుంటుందన్నారు. స్వేచ్ఛాయుత, అరమరికలు లేని ఇండో-పసిఫిక్ ప్రాంతం సాకారం కావడం కోసం భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ సంఘటితం కావాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించడంతో సహా, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాల కోసం గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-03-13T02:22:26+05:30 IST