విశాఖ మన్యం ప్రశాంతం
ABN , First Publish Date - 2021-07-30T05:50:29+05:30 IST
విశాఖ మన్యంలో ప్రశాంత వాతావరణం నెలకొందని రూరల్ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు చెప్పారు.
రూరల్ జిల్లా ఎస్పీ కృష్ణారావు
అనకాపల్లి టౌన్, జూలై 29: విశాఖ మన్యంలో ప్రశాంత వాతావరణం నెలకొందని రూరల్ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు చెప్పారు. గురువారం సాయంత్రం ఉడ్పేట షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఏడు, ఎనిమిది సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలో కూంబింగ్ విస్తృతంగా నిర్వహించడమే కాకుండా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. గంజాయిపై విస్తృత నిఘా పెంచామన్నారు. ఇప్పటికే అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని నిరంతరం వాహనాలు తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. సచివాలయ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించినట్టు ఎస్పీ తెలిపారు. మహిళా పోలీసులు క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలను, వారు రాసే రికార్డులను పరిశీలించారు. అంతేకాకుండా సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి విద్యార్హత గురించి సచివాలయ అడ్మినిస్ర్టేటివ్ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో సేవలు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల మంజూరు విధి విధానాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బోర్డులను, ఫ్లెక్సీలను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ కె. శ్రావణి, పట్టణ, రూరల్ సీఐలు ఎల్.భాస్కరరావు, జి.శ్రీనివాసరావు, ఎస్ఐలు ఆర్.ధనుంజయ్, కిరణ్, ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.