‘కరోనా టీకా కారణంగానే వివేక్ మృతి’
ABN , First Publish Date - 2021-04-18T18:12:08+05:30 IST
కరోనా టీకా కారణంగానే నటుడు వివేక్ మృతిచెందారని, ఆయన కరోనా టీకాతో మరణించలేదని ఎలా నిర్ధారిస్తారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్
- నటుడు మన్సూర్ అలీఖాన్
చెన్నై: కరోనా టీకా కారణంగానే నటుడు వివేక్ మృతిచెందారని, ఆయన కరోనా టీకాతో మరణించలేదని ఎలా నిర్ధారిస్తారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ మండిపడ్డారు. శనివారం వివేక్ భౌతికకాయానికి అంజలి ఘటించిన అనంతరం ఆయన భావోద్వేగంతో మీడియాతో మాట్లాడారు. ‘కరోనా కేసుల సంఖ్య పత్రికల్లో వేయడం నిలిపివేయండి. ఎందుకు ప్రజలను భయపెడుతూ చంపుతున్నారు? అడిగేవారు లేరనేనా? దేశంలో కరోనా పరీక్షలు నిలిపివేయండి, మరుసటిరోజే దేశంలో కరోనా ఉండదు. వివేక్ బాగానే ఉన్నాడుగా, ఎందుకు కరోనా టీకా వేశారు? ఆ టీకాలో ఎలాంటి సామర్ధ్యం ఉంది? దేశంలో కరోనా లాంటి వైరస్లు చాలా ఏళ్లుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. టీకాతోనే వివేక్ మరణించలేదని ఎలా నిర్ధారిస్తారు? ఎవరు చెబుతారు? తొండాముత్తూరు నియోజకవర్గంలో పోటీచేసిన నేను ప్రచారంలో భిక్షగాళ్ల పక్కన, కుక్క పక్కన కూడా కూర్చున్నాను. నాకు కరోనా రాలేదే? మాస్క్లు వేసుకోమని ఎందుకు చెబుతున్నారు? మనం వదిలే గాలి చెడ్డగాలి అని చెబుతున్నారు, మరి మాస్క్ వేసుకొంటే చెడ్డగాలిని మళ్లీ పీల్చాల్సి వస్తుందిగా? మాస్క్లు వేసుకోలేదని జరిమానా విధిస్తున్నారు. కరోనా లేదని నేను స్పష్టంగా చెబుతున్నాను. నన్ను తీసుకెళ్లి జైలులో వేయండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. షూటింగ్లకు కరోనా సర్టిఫికెట్ తప్పనిసరి చేయడంతో, ఈ టెస్ట్కు రూ.2 వేలు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోంది. అంత స్థోమత లేని జూనియర్ ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయి రోడ్లపై పడ్డారు. కరోనా...కరోనా... అంటారా? పనులు కోల్పోయిన ఇబ్బంది పడుతున్న ప్రతి రేషన్కార్డుకు రూ.1 లక్ష ఇవ్వండి. కరోనా టీకా వేయించుకొనే వారందరికి ఇన్యూరెన్స్ ఇవ్వండి. వ్యాధి నిరోధక శక్తి పెంచేలా పారంపర్యమైన మూలికల కషాయాలను ప్రజలకు ఉచితంగా, విరివిరిగా అందించండి. కరోనా పేరిట ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతూ ప్రభుత్వాలు కాలం గడుపుతున్నాయి. ఇది ఏమాత్రం సరి కాదు. పరిష్కారించాల్సిన చోట సమస్యను పెంచుతున్నారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలను చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ఖండించారు. వివేక్ మృతికి, కరోనా టీకాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.