వార్డు రక్షక దళాలతో మత ప్రదేశాల్లో భద్రత

ABN , First Publish Date - 2021-01-21T06:08:20+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలకు భద్రత ఉండేలా వార్డు రక్షక దళాలను ఏర్పాటు చేసినట్టు సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు

వార్డు రక్షక దళాలతో మత ప్రదేశాల్లో భద్రత

సీపీ మనీష్‌కుమార్‌సిన్హా

విశాఖపట్నం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలకు భద్రత ఉండేలా వార్డు రక్షక దళాలను ఏర్పాటు చేసినట్టు సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. నగరంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలు 1600 ఉన్నట్టు గుర్తించామన్నారు. వీటిలో 400 చోట్ల ప్రైవేటు సెక్యూరిటీ లేదా కమిటీల వలంటీర్లతో భద్రత కల్పిస్తున్నారని, మరో 650 చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. మిగిలిన ప్రదేశాల్లో బీట్‌ పోలీసులు రాత్రి పూట తనిఖీలు చేస్తున్నారన్నారు. అలాంటివాటన్నింటికీ పక్కాగా భద్రత ఉండేలా స్థానికంగా ఉండే ముగ్గురిని వార్డు రక్షక దళం పేరుతో కమిటీగా ఏర్పాటుచేసి బాధ్యతలను అప్పగిస్తామన్నారు. ఇలా 333 వార్డు రక్షక దళాలను ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించగా, ఇప్పటికే 274 ఏర్పాటు  చేశామన్నారు. త్వరలో మిగిలిన వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి వారందరితో స్థానిక పోలీసులను అనుసంధానం చేస్తూ టెలిగ్రామ్‌లో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, సలహాలు, సూచనలు పంచుకోవడం చేస్తామని సీపీ తెలిపారు. అలాగే నగరంలో ఉన్న శాంతి కమిటీలతో తరచూ సమావేశాలు నిర్వహించి మతపరమైన విద్వేషాలు, ఘర్షణలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


Updated Date - 2021-01-21T06:08:20+05:30 IST