స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షిస్తే రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడినట్టే..

ABN , First Publish Date - 2021-04-14T06:21:53+05:30 IST

విశాఖ ఉక్కును కాపాడితే రాష్ట్ర ప్రతిష్ఠ కాపాడినట్లేనని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు పరంధామయ్య అన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షిస్తే  రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడినట్టే..
సమావేశంలో ప్రసంగిస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు పరంధామయ్య

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు పరంధామయ్య 

61వ రోజు కొనసాగిన ఉద్యోగుల దీక్షలు

కూర్మన్నపాలెం, ఏప్రిల్‌ 13: విశాఖ ఉక్కును కాపాడితే రాష్ట్ర ప్రతిష్ఠ కాపాడినట్లేనని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు పరంధామయ్య అన్నారు. కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 61వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ రిలే నిరాహార దీక్షలో సీఎంఎం, సీఎంఈ, ఈటీఎల్‌, టెలికాం, ఏసీఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరందామయ్య ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ జాతి సంపద అయిన విశాఖ ఉక్కును హరించి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్నారు. ఇది పెట్టుబడిదారులకు, కార్మిక వర్గానికి జరుగుతున్న పోరాటమన్నారు. వేలాది ఎకరాల భూమిని దోచుకునేందుకు స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు.  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కారు చౌకగా ప్రజా సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నదన్నారు. ఉద్యోగులతోపాటు ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళలు, యువత ఈ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ  రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమయిందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరామ్‌, గంధం వెంకటరావు, బోసుబాబు, బొడ్డు పైడిరాజు, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు, వేములపాటి ప్రసాద్‌, గంగవరం. గోపి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-14T06:21:53+05:30 IST