HYD : ఒకేసారి నీటి బకాయిలు చెల్లించేవారికి వడ్డీ మాఫీ!
ABN , First Publish Date - 2021-10-11T17:28:24+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరుకుపోయిన నీటి బకాయిల వసూళ్లకు మరోసారి వన్...
- మరోసారి ఓటీఎస్
- నీటి బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాఫీ
- గతేడాది రూ.200కోట్లకు పైగా ఆదాయం
హైదరాబాద్ సిటీ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరుకుపోయిన నీటి బకాయిల వసూళ్లకు మరోసారి వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) తీసుకొచ్చేందుకు వాటర్బోర్డు కసరత్తు చేస్తోంది. ఒకేసారి నీటి బకాయిలు చెల్లించేవారికి వడ్డీని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. గతేడాది అమలు చేసిన ఈ స్కీమ్ ద్వారా బోర్డుకు మెరుగైన ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా ఓటీఎస్ అమలు చేయడానికి అధికారులు ప్రభుత్వ అనుమతులు కోరినట్లు తెలిసింది. గ్రీన్ సిగ్నల్ రాగానే వచ్చే నెల నుంచి అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ముందుకొచ్చిన బకాయిదారులు
వాటర్బోర్డుకు గృహ, కమర్షియల్ కనెక్షన్ల నుంచి సుమారు రూ.1700 కోట్ల వరకు నీటి బిల్లులు రావాల్సి ఉంది. వీటిలో పలు ప్రభుత్వ సంస్థల బకాయిలే రూ.1200 కోట్లు. ఏటా ఆర్థిక సంవత్సరం చివరన మార్చి నెలలో నీటి బిల్లుల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, ఆయా సంస్థలు బడ్జెట్ లేకపోవడంతో బకాయిలను చెల్లించడం లేదు. గతేడాది వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ తీసుకురాగా వాటర్బోర్డుకు రూ.200 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. చాలా మంది బకాయిదారులు ముందుకొచ్చారు. తాము వినియోగించిన నీటికి సరాసరి బిల్లులను చెల్లించారు. పలు ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా బకాయిలు చెల్లించారు.