డిసెంబరు 21కి కృష్ణా జలాలందిస్తాం
ABN , First Publish Date - 2020-09-19T10:38:06+05:30 IST
యుద్ధప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు కానుకగా డిసెంబరు 21వ తేదీ నా
మొదటి సొరంగం పనులను పరిశీలించిన కలెక్టర్
పెద్దదోర్నాల, సెప్టెంబరు 18 : యుద్ధప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు కానుకగా డిసెంబరు 21వ తేదీ నాటికీ కృష్ణా జలాలందిస్తామని కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశ పనులు పూర్తి చేసే క్రమంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో వెలిగొండ పనుల వద్ద శుక్రవారంసమీక్షించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూఇప్పటికీ మొదటి సొరంగం పనులు ఇంకా 396 మీటర్ల తవ్వాలని, అక్టోబర్ మాసాంతానికి పూర్తవుతాయని తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్తో ఇటు నుంచి 250 మీటర్లు, హెడ్ రెగ్యులేటర్ వైపు నుంచి 1.50 మీటర్లు మాన్యువల్ పనులు చేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అన్నీ సమస్యలు అధిగమించి డిసెంబరు మూడో వారం నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి 7 టీఎంసీల నీటిని రిజర్వాయర్లకు తరలిస్తామన్నారు.
నిర్వాసితులకు ఒన్టైమ్ సెటిల్మెంటు ప్రకారం రూ.12.50లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 2021 డిసెంబరునాటికి రెండో టన్నెల్ కూడా పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ నగేశ్, ఆర్డీవో శేషిరెడ్డి, స్పెషల్ కలెక్టర్ కృష్ణవేణి, మెగా కనస్ట్రక్షన్ ప్రతినిధి సైదారెడ్డి, తహసీల్దార్ ఏవీ హనుమంతరావు, ఆర్ఐ నాగేశ్వరరావు, దోర్నాల ఈవో రామిరెడ్డి పాల్గొన్నారు.
నిర్వాసితులకు పునరావాస కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండంచర్ల గ్రామం నిర్వాసితులకు దేవరాజుగట్టులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామంలో గుండంచర్ల నిర్వాసితులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడానికి అనువైన భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ ఉమారాణి పాల్గొన్నారు.