గజ దాడుల బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తాం
ABN , First Publish Date - 2021-06-18T05:13:13+05:30 IST
గజ దాడుల్లో పంటలు నష్టపోయిన, మృతి చెందిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరినారాయణన్ అటవీ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 17: గజ దాడుల్లో పంటలు నష్టపోయిన, మృతి చెందిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరినారాయణన్ అటవీ అధికారులను ఆదేశించారు. కౌండిన్య వైల్డ్లైఫ్ పరిధిలోని పలమనేరు, కుప్పం, పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఏనుగుల మరణాలు, రైతులకు జరిగిన నష్టంపై కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగుల సంచరించే ప్రాంతాల్లో పంటలకు నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వెస్ట్ డీఎఫ్వో రవిశంకర్ మాట్లాడుతూ సుమారు 6వేల హెక్టార్లలో విస్తరించిన కౌండిన్య ఎలిఫెంట్ జోన్లో 2012లో 8 ఏనుగులు సంచరిస్తుండగా వాటి సంఖ్య ప్రస్తుతం 70-90కి పెరిగిందన్నారు. 2013 నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 13 ఏనుగులు, 10 మంది రైతులు, 37 పశువులు మృతి చెందగా 9 మంది గాయపడ్డారన్నారు. పలమనేరు ప్రాంతంలో 4610 హెక్టార్లకు గాను 3426 హెక్టార్లలో మాత్రమే ఫెన్సింగ్ వేయడం వల్ల మిగిలిన ప్రాంతాల నుంచి ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా జాతీయ రహదారులపై ట్రాఫిక్ లేకపోవడంతో రోడ్లపైకి ఏనుగులు వస్తున్నాయని చెప్పారు. తూర్పు డీఎఫ్వో నరేందిరన్ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి కౌండిన్య ఎలిఫెంట్ జోన్ పరిధిలోకి ఏనుగులు వస్తున్నాయన్నారు. ఏనుగుల నుంచి పంటలను కాపాడుకోవాలనే ఆతృతతో రైతులు ఏనుగులపై దాడులకు పాల్పడుతున్నారని, దీంతో అవి రైతులపై తిరగబడి చంపేస్తున్నాయని చెప్పారు. గజ దాడుల్లో మృతి చెందిన రైతులకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారం ఏ మాత్రం సరిపోదని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు కలిసి నివేదిక అందిస్తే ప్రభుత్వానికి పంపి రైతులను ఆదుకుంటామన్నారు. ఉపాధి హామీకింద అటవీశాఖలో పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అటవీ అఽధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.