ప్రశాంతంగా ముగిసిన వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-08-04T06:12:39+05:30 IST

ఆంధ్రా,ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు తలపెట్టిన వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, కటాఫ్‌ ఏరియా గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రశాంతంగా ముగిసిన వారోత్సవాలు
ఆంధ్రా,ఒడిశా సరిహద్దులో కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న పోలీసు బలగాలు


ఊపిరి పీల్చుకున్న పోలీసులు, గిరిజనులు

సీలేరు, ఆగస్టు 3: ఆంధ్రా,ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు తలపెట్టిన వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, కటాఫ్‌ ఏరియా గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.  జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు ఏవోబీలో అమరవీరుల వారోత్సవాలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రెండు రాష్ర్టాల పోలీసులు వారోత్సవాలకు పది రోజుల ముందు నుంచే ఏవోబీని జల్లెడ పట్టారు. జూలై 20న జీకేవీధి మండలం పెబ్బంపల్లి వద్ద మరోసారి పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఏవోబీలో మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు పక్కా సమాచారం పోలీసుల నిఘా వర్గాలకు అందుతున్నది. ఈ నేపథ్యంలో అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు జరుపుకోలేని పరిస్థితి ఎదురైంది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా చెప్పుకునే ఒడిశాలో కూడా ఎక్కడ పడితే అక్కడ అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేసి, నిత్యం కూంబింగ్‌ నిర్వహిస్తుండడంతో మావోయిస్టుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఏవోబీలో ఎటువంటి సంఘటనలు జరగపోవడంతో ఇరు రాష్ర్టాల పోలీసులు, సరిహద్దు ప్రాంతాల గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.


 

Updated Date - 2021-08-04T06:12:39+05:30 IST