పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు... రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం...

ABN , First Publish Date - 2021-04-18T19:20:59+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు... రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం...

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఆయన పాల్గొనవలసిన అన్ని బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. భారీ బహిరంగ సభల ఏర్పాటు వల్ల పర్యవసానాలను ఆలోచించాలని ఇతర రాజకీయ నాయకులను ఆయన కోరారు. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో 6వ, 7వ, 8వ దశల పోలింగ్‌కు ముందు నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలను సస్పెండ్ చేసినట్లు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఇదే విధంగా సభలను రద్దు చేయడంపై ఆలోచించాలని ఇతర రాజకీయ పార్టీల నేతలను కూడా కోరుతున్నానని తెలిపారు. 


దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో భారీ బహిరంగ సభల్లో పాల్గొంటుండటంపై విమర్శలు వస్తున్నాయి. మోదీ భారీ బహిరంగ సభలను నిర్వహిస్తుండటం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆరోపించారు. ప్రజలను పట్టించుకోకుండా దిగ్భ్రాంతికరంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 


Updated Date - 2021-04-18T19:20:59+05:30 IST