టైఫాయిడ్ జ్వరంతో 16 కిలోలు తగ్గిన యువకుడు మళ్లీ బరువు పెరగాలంటే..
ABN , First Publish Date - 2020-06-09T21:26:21+05:30 IST
నాకు ఇరవైమూడేళ్లు. టైఫాయిడ్ జ్వరం వచ్చి పదహారు కేజీలు తగ్గాను. బరువు పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ప్రశ్న: నాకు ఇరవైమూడేళ్లు. టైఫాయిడ్ జ్వరం వచ్చి పదహారు కేజీలు తగ్గాను. బరువు పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- రాకేష్, కందుకూరు
డాక్టర్ సమాధానం: టైఫాయిడ్ లాంటి అనారోగ్యం వచ్చినప్పుడు బరువు తగ్గడం సాధారణం. జ్వరం తగ్గిన తరువాత కొన్ని రోజులపాటు నీరసం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన ఆహార నియమాలు పాటించకపోతే అధికంగా బరువు తగ్గిపోతారు. సాధారణంగా మీ వయసు వారు, 2000 నుండి 2500 కెలోరీల ఆహారం తీసుకోవాలి. కానీ బరువు పెరగాలంటే దీని మోతాదు పెంచాలి. అన్నం, కూరలూ అధికంగా తీసుకోవాలి. రోజుకు కనీసం అరలీటరు పాలు, అరలీటరు పెరుగు తీసుకోవాలి. మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీనికోసం గుడ్లు, మాంసం; శాకాహారులైతే ప్రతి పూటా పప్పు, గింజలతో చేసిన కూరలు, పనీర్ మొదలైనవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయాన్నే నానబెట్టిన బాదం గింజలు, రెండు ఉడకబెట్టిన గుడ్లు తీసుకోండి. రోజూ రెండు పళ్ళు తినండి. సాయంత్రం ఓ గుప్పెడు వేరుశెనగ పప్పు; ఉడికించిన గింజలు; కొబ్బరి, నువ్వులు, డ్రైఫ్రూట్స్తో చేసిన లడ్డు మొదలైనవి స్నాక్స్లా తీసుకున్నా మంచిదే. ఈ రకంగా ఆరోగ్యకరమైన ఆహారంతో బరువు పెరిగే ప్రయత్నం చేయడం మంచిది. అలా కాకుండా స్వీట్లు, చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లతో త్వరగా బరువు పెరిగినా సరే ఆ తరువాత అనారోగ్యం పాలు కావచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.comకు పంపవచ్చు)