కొవిడ్ బాధితులకు ఏం చేశారు..?
ABN , First Publish Date - 2021-06-14T05:30:00+05:30 IST
కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్న పేదలకు ఏం సాయం చేశారో చెప్పాలని సీఎం జగన్ను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు.
- సీఎం జగన్పై ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఫైర్
కర్నూలు(అగ్రికల్చర్), జూన్ 14: కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్న పేదలకు ఏం సాయం చేశారో చెప్పాలని సీఎం జగన్ను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని తన స్వగృహంలో సోమవారం కేఈ ప్రభాకర్ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. పక్క రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పర్యవేక్షిస్తున్నారని, ముఖ్య మంత్రి జగన్ మాత్రం తాడేపల్లి నివాసానికే పరిమితమయ్యారని విమర్శించారు. కరోనా మొదటి సారి వచ్చిన సమయంలో సీరియస్గా ఆలోచించి ఉంటే, ఇప్పుడు ఇంత నష్టం జరిగేది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు ముందస్తు హెచ్చరికలు చేసినా సీఎం జగన్ పట్టించుకోలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ నేతలు బ్లాక్ మార్కెట్, మందుల దందా చేస్తున్నారని అన్నారు. ప్రజారోగ్యం కోసం కేరళ ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని, తమిళనాడు రూ.4,153 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ.1250 కోట్లు, ఒడిసా రూ.2,200 కోట్లను ప్రకటించాయని, మన రాష్ట్రంలో జగన్ ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. కష్టకాలంలో ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమాను నిలిపివేశారని, అన్న క్యాంటిన్లను మూసివేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలను ముఖ్యమంత్రి జగన్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.