రైతు బంధు సాయమెప్పుడు?
ABN , First Publish Date - 2022-06-20T04:14:45+05:30 IST
జిల్లాలోని రైతు బంధు సాయం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటికే తొలకరి చినుకులు మొదలవడంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు.
- తప్పని పడిగాపులు
- ఇప్పటికే ప్రారంభమైన వ్యవసాయ పనులు
- ఆందోళనలో రైతులు
చింతలమానేపల్లి, జూన్ 19: జిల్లాలోని రైతు బంధు సాయం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటికే తొలకరి చినుకులు మొదలవడంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు సాయాన్ని మొత్తం 1.11లక్షల మంది రైతులు అందుకుంటున్నారు. సగటున ప్రతీ ఏడాది వానాకాలం సీజన్లో రూ.199కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు నేరుగా జమవుతు న్నాయి. 2020-21వర్షాకాలం లెక్కలను తీసుకుంటే 1.13లక్షల మంది పట్టాలకు గానూ 1.07లక్షల మంది బ్యాంక్ ఖాతాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయగా 1.06లక్షల మంది రైతుల ఖాతాల్లో 188.02కోట్ల నిధులు జమ య్యాయి. అయితే ఈ ఏడాది మరో 5వేలపైనే ఖాతాలు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అలాగే యాసంగి సీజన్లో 1.15లక్షల ఖాతాలకు గానూ 1.09లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయగా 1.08లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.188.24 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈసారి రైతుల సంఖ్య పెరగడంతో పాటు పెట్టుబడి సాయం కూడా 199 కోట్లకు చేరుకోనుంది.
అప్పులపైనే భారం
రైతు బంధు సాయం సకాలంలో అందకపోవడంతో జిల్లాలోని రైతాంగం ప్రైవేటు అప్పులపైనే భారం వేసి ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతు బంధు సాయం అందకపోవడంతో దళారులు, వివిధ సంస్థల వ్యాపారులు, ముఖ్యంగా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ వ్యాపారులు రైతాంగాన్ని మచ్చిక చేసుకొని కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అప్పుగా ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వారికి వచ్చే రేట్లలో రెండింతలకు అమ్మకంతో పాటు వాటికి వడ్డీ కలిపి వచ్చే ఏడాది అనగా పత్తి లేదా వరి చేతికొచ్చాక తమకే చెప్పిన ధరలకే విక్రయాలు జరపాలన్న ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రైతులు పండించిన పంటలు దళారికి, వ్యాపారులకు అమ్మితే రైతులకు మిగిలేది ఏమి ఉండదని తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏటా రైతాంగానికి ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందజేయాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పెట్టుబడి సాయం అందించాలి
- చౌదరి కేదారి, రైతు
ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు త్వరగా అందజేయాలి. నేరుగా ఖాతాల్లో జమ చేయడంతో వ్యవసాయ పనులకే కాకుండా ఇతర పనులకు వాడుకునే అవకాశం ఉటుంది. ప్రభుత్వం స్పందించి రైతుల ఇబ్బందులపై సానుకూలంగా స్పందించాలి.
డబ్బులను జమ చేయాలి
- రామగిరి సంజీవ్, బీజేపీ జిల్లా యువ నాయకుడు
ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. నేటికీ రైతు బంధు సాయం అందలేదు. రైతుల పెట్టుబడి కోసం ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ వడ్డీలతో రైతులు నష్టపోతారు. ప్రభుత్వం వెంటనే రైతు బంధు సాయం రిలీజ్ చేయాలి.