గుర్రం యజమాని ఎవరు?
ABN , First Publish Date - 2020-11-26T05:30:00+05:30 IST
ఒకరోజు ఇద్దరు వ్యక్తులు ఒక గుర్రాన్ని తీసుకుని అక్బర్ సభకు వచ్చారు. మీరే న్యాయం చేయాలంటూ మహారాజును వేడుకున్నారు. విషయం ఏంటని అడిగితే అందులో ఒకడు ‘మహారాజా! నాది పొరుగూరు. పని నిమిత్తమై ఇక్కడకు వస్తుండగా ఈ వ్యక్తి దారిలో కనిపించాడు. సహాయం చేయమని అడిగితే గుర్రంపై ఎక్కించుకుని తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఆ గుర్రం
ఒకరోజు ఇద్దరు వ్యక్తులు ఒక గుర్రాన్ని తీసుకుని అక్బర్ సభకు వచ్చారు. మీరే న్యాయం చేయాలంటూ మహారాజును వేడుకున్నారు. విషయం ఏంటని అడిగితే అందులో ఒకడు ‘మహారాజా! నాది పొరుగూరు. పని నిమిత్తమై ఇక్కడకు వస్తుండగా ఈ వ్యక్తి దారిలో కనిపించాడు. సహాయం చేయమని అడిగితే గుర్రంపై ఎక్కించుకుని తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఆ గుర్రం నాది అంటున్నాడు. మీరే నాకు న్యాయం చేయండి. నా గుర్రం నాకు ఇప్పించండి’’ అంటూ మొరపెట్టుకున్నాడు. ఇంతలో మరో వ్యక్తి కలగజేసుకుంటూ ‘మహారాజా! ఆ గుర్రం నాదే. నేనే ఆయనను గుర్రంపై ఎక్కించుకుని తీసుకొచ్చాను’ అని అన్నాడు. గుర్రానికి నిజమైన యజమాని ఎవరనేది తెలుసుకోవడం అక్బర్కు కష్టమైంది. దాంతో బీర్బల్ను పిలిచి వాళ్ల తగవు తీర్చాల్సిందిగా అజ్ఞాపించాడు. బీర్బల్ జరిగిన విషయం తెలుసుకుని ఆ గుర్రాన్ని గుర్రపు శాలలో కట్టేయమని చెప్పి, వాళ్లిద్దరిని మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించాడు. ఉదయాన్నే తిరిగి ఇద్దరూ సభకు వచ్చారు. అందులో ఒకడిని పిలిచి ఆ గుర్రం నీదే. గుర్రపుశాలలో ఉంది వెళ్లి తెచ్చుకో! అని చెప్పి పంపాడు బీర్బల్. గుర్రపుశాలలో చాలా గుర్రాలున్నాయి. అందులో వాడు ఎక్కి వచ్చిన గుర్రం ఏదో వాడికి అర్థం కాక, తిరిగి వెళ్లి అదే విషయాన్ని బీర్బల్కు చెప్పాడు. మరో వ్యక్తిని వెళ్లమని చెప్పాడు బీర్బల్. అతడు గుర్రపుశాలలోకి వెళ్లగానే యజమానిని చూసి గుర్రం సకిలించింది. యజమాని కూడా గుర్రాన్ని ఇట్టే గుర్తుపట్టాడు. దాంతో బీర్బల్ గుర్రం అసలు యజమాని అతడే అని నిర్ణయించి, గుర్రాన్ని అతడికి ఇచ్చి పంపించాడు.