35 మంది టీఆర్ఎస్ సిట్టింగ్‌లు ఎందుకు ఓడిపోయారు..!?

ABN , First Publish Date - 2020-12-05T15:40:46+05:30 IST

టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీకి చెందిన 99 మంది అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. వీరిలో 72 మందికి మరోసారి పోటీకి అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఇందులో 35 మంది ఓటమి చెందారు. వీరిలో కొందరు మూడోసారి పోటీ చేయగా, కొందరు రెండోసారి బరిలోకి దిగారు.

35 మంది టీఆర్ఎస్ సిట్టింగ్‌లు ఎందుకు ఓడిపోయారు..!?

  • కొంప ముంచిన వ్యతిరేకత
  • ఎల్‌బీనగర్‌లో మొత్తం 10 స్థానాలు గల్లంతు 
  • మరికొన్ని చోట్లా అదే పరిస్థితి

హైదరాబాద్‌ : మెజారిటీ డివిజన్లలో సిట్టింగ్‌లను బరిలోకి దించిన టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీకి చెందిన 99 మంది అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. వీరిలో 72 మందికి మరోసారి పోటీకి అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఇందులో 35 మంది ఓటమి చెందారు. వీరిలో కొందరు మూడోసారి పోటీ చేయగా, కొందరు రెండోసారి బరిలోకి దిగారు. చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నా, అధిష్ఠానం వారిని బరిలో నిలిపింది. ఇదే ఇప్పుడు కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


- అంబర్‌పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉండగా.. నల్లకుంట, బాగ్‌అంబర్‌పేటలో సిట్టింగ్‌లు గరిగంటి శ్రీదేవీరమేష్‌, పద్మావతిరెడ్డిలకు అవకాశం ఇచ్చారు. వారిద్దరూ  ఓటమి చవిచూశారు. 


- సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో నాలుగు చోట్ల సిట్టింగ్‌లను బరిలో నిలిపారు. అమీర్‌పేట నుంచి శేషుకుమారి, రాంగోపాల్‌పేట సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అత్తెల్లి అరుణగౌడ్‌లు ఓటమి చెందారు. మరో ఇద్దరు విజయం సాధించారు. 


- ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో సిట్టింగ్‌లకు మరో చాన్స్‌ ఇచ్చారు. రాంనగర్‌, ముషీరాబాద్‌, అడిక్‌మెట్‌, గాంధీనగర్‌, కవాడిగూడలో శ్రీనివా్‌సరెడ్డి, ఎడ్లభాగ్యలక్ష్మి, హేమలత, పద్మ, లాస్య నందితలు ఓటమి పాలయ్యారు. 


- గోషామహల్‌లోని ఆరు డివిజన్లలో మూడు చోట్ల సిట్టింగ్‌లు బరిలో నిలిపారు. మంగళ్‌హట్‌, గన్‌ఫౌండ్రి, గోషామహల్‌ నుంచి పరమేశ్వరీసింగ్‌, మమతాగుప్తా, ముఖే్‌షసింగ్‌లు పరాజయం పాలయ్యారు. 


- ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ ఖాతాలోని 10 స్థానాల్లో సిట్టింగ్‌లకు అవకాశమిచ్చారు. వారంతా ఓడిపోయారు. 


- ఉప్పల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చారు. రామంతాపూర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, ఏఎ్‌సరావునగర్‌లో ప్రస్తుత కార్పొరేటర్లుగా ఉండి మళ్లీ బరిలో నిలిచిన వారు ఓటమి పాలయ్యారు. 


- ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఐదు చోట్ల సిట్టింగ్‌లకు అవకాశం ఇవ్వగా, జూబ్లీహిల్స్‌, హిమాయత్‌నగర్‌ డివిజన్లలో ఖాజా సూర్యనారాయణ, ప్రేమలతలు పరాజితులయ్యారు. 


- మలక్‌పేట నియోజకవర్గంలో సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, ముసారాంబాగ్‌ల నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌లు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, సామ స్వప్న, సునరితారెడ్డిలు ఓటమి పాలయ్యారు.


- కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆరుగురు సిట్టింగ్‌లకు అవకాశం ఇవ్వగా, మూసాపేటలో తూము శ్రవణ్‌కుమార్‌ ఓడిపోయారు. 


- కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలో ఏడుగురు సిట్టింగ్‌ లను మళ్లీ బరిలో నిలపగా, జీడిమెట్ల సిట్టింగ్‌ కార్పొరేటర్‌ పద్మ పరాజయం పాలయ్యారు. 

- ఖైరతాబాద్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన ఓటర్లు ఈ సారి బీజేపీ వైపు మొగ్గు చూపించారు. 2016లో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఆరు సిట్టింగ్‌లు ఉండగా ఈ సారి రెండింట బీజేపీ విజయబావుటా ఎగుర వేసింది.

Updated Date - 2020-12-05T15:40:46+05:30 IST