బోటు తయారీ ఎందుకో..
ABN , First Publish Date - 2021-06-19T06:16:48+05:30 IST
నాగర్కర్నూల్ జిల్లా కొల్లా పూర్ మండలం రేగుమానుగడ్డ సమీపంలోని ఎంజీఎల్ఐ (మహాత్మా గాంధీ లిఫ్టు ఇరిగేషన్) అప్రోచ్ కెనాల్ వద్ద భారీ బోటును తయారు చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమానుగడ్డ సమీపంలో సిద్ధం చేస్తున్న భారీ బోటు
గతంలో ఏపీలోని వెలుగొండ ప్రాజెక్టుకు కొల్లాపూర్ ఇసుకను బోటులో అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే
ప్రస్తుతం బోటు తయారీ ఇసుక తరలింపునకే అనే సందేహాలు
నాగర్కర్నూల్(ఆంధ్రజ్యోతి)/కొల్లాపూర్ రూరల్, జూన్ 18 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లా పూర్ మండలం రేగుమానుగడ్డ సమీపంలోని ఎంజీఎల్ఐ (మహాత్మా గాంధీ లిఫ్టు ఇరిగేషన్) అప్రోచ్ కెనాల్ వద్ద భారీ బోటును తయారు చేస్తున్నారు. ఎందుకు తయారు చేస్తున్నారనే విషయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టుకు అక్రమంగా కొల్లాపూర్ ఇసుకను బోటులో తరలిస్తుండగా ఎమ్మెల్యే తన అనుచరులతో అడ్డుకోవడంతో పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఎంజీ ఎల్ఐఅప్రోచ్ కెనాల్ వద్ద భారీ బోటును తయారు చేస్తుండటంపై కూడా ఇసుక తరలిం పునకేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. ప్రైవేటు గస్తీ మధ్య బోటును తయారు చేస్తున్న సిబ్బందిని ఈ విషయమై ఆంధ్రజ్యోతి శుక్రవారం ప్రశ్నించగా వెలుగొండ ప్రాజెక్టుకు మెటీరియల్ తీసుకొని వెళ్లేందుకు తయారు చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. ఏ మెటీరియల్ తీసుకెళుతున్నారనే అంశంపై స్పష్టత లేదు. పుట్టిలు, మరబోట్ల ద్వారా చేపలు పట్టే సామాన్య మత్స్యకారులపై చర్యలు తీసుకునే ఫారెస్టు అధికారులు ఈ బోటు తయారీకి అనుమతించారా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయమై పీఆర్ఎల్ఐ (పాల మూరు రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్) ఈఈ శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరగా పీఆర్ఎల్ఐ మొదటి ఫ్యాకేజీ అప్రోచ్ కెనాల్ వద్ద పనుల పర్యవేక్షణ కోసం బోటును తీసుకొని వస్తు న్నట్లు సమచారం ఉన్నదన్నారు. బోటు తయారీ విషయం తన దృష్టికి రాలేదన్నారు.