20 ఏళ్ల ఈ యువతికి 15 నెలల క్రితం పెళ్లి.. 4నెలల బాబుతో భర్త ఎందుకు ఎస్కేప్ అయ్యాడంటే..

ABN , First Publish Date - 2021-07-07T23:40:58+05:30 IST

చూడటానికి చక్కగా ఉంటుంది. వంటా వార్పూ అన్నీ చేస్తుంది. నాలుగు నెలల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబంలో పెద్దవారికి గౌరవం ఇస్తుంది... కట్టుకున్న భార్యలో ఇంతకన్నా మంచి గుణాలు ఎవరూ కోరుకోరు.

20 ఏళ్ల ఈ యువతికి 15 నెలల క్రితం పెళ్లి.. 4నెలల బాబుతో భర్త ఎందుకు ఎస్కేప్ అయ్యాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: చూడటానికి చక్కగా ఉంటుంది. వంటా వార్పూ అన్నీ చేస్తుంది. నాలుగు నెలల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబంలో పెద్దవారికి గౌరవం ఇస్తుంది... కట్టుకున్న భార్యలో ఇంతకన్నా మంచి గుణాలు ఎవరూ కోరుకోరు. ఈ గుణాలు ఉన్న భార్య దొరికితే జీవితం సాఫీగా సాగిపోతుందని సంతోషిస్తారు. కానీ నిరంజన్ కుమార్ అనే వ్యక్తికి ఇవేమీ పట్టలేదు. అతని మనసంతా డబ్బుపైనే. అందుకే పెళ్లి సమయంలో కట్నం కోసం పట్టుబట్టాడు. వాళ్ల వీళ్ల కాళ్లు పట్టుకొని ఆ అమ్మాయి కుటుంబం అతని డబ్బు దాహాన్ని తీర్చింది. కానీ నిరంజన్ కుమార్ కుటుంబం కక్కుర్తి తీరలేదు. ఇంకా ఇంకా డబ్బు కావాలంటూ ఆమెను వేధించసాగారు. చివరకు ఆమెకు నిప్పుపెట్టి, ఆమె చేసే ఆక్రందనలు వింటూ నిలబడ్డారు. మరో నిమిషంలో ఆమె చనిపోతుందనగా.. మంటలు ఆర్పి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చనిపోయింది. ఈ ఘోరమైన ఘటన బిహార్‌లోని భగల్‌పూర్‌లో వెలుగు చూసింది.


స్థానికంగా నివశించే ప్రియాంక అనే అమ్మాయిని నిరంజన్ కుమార్‌కు ఇచ్చి ఏడాది క్రితమే పెళ్లి చేశారు. వీరి వివాహం జరిగి 15 నెలలే. ఈ జంటకు నాలుగు నెలల క్రితమే ఒక పండంటి బాబు పుట్టాడు. పెళ్లి సమయంలో నిరంజన్ అడిగిన కట్న కానుకలను ప్రియాంక కుటుంబం అందించింది. అప్పటికి సర్దుకున్న నిరంజన్ ఫ్యామిలీ.. బాబు పుట్టాక మరో రెండు లక్షల రూపాయలు కట్నం కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. అప్పటికే ప్రియాంకకు నరకం అంటే ఏంటో చూపిస్తున్న ఆ కుటుంబం.. ఈ డబ్బు అందకపోవడంతో మరింత విజృంభించింది. తాజాగా ఈ విషయంలో ప్రియాంకతో గొడవపడిన నిరంజన్ అండ్ ఫ్యామిలీ.. ఆమెను తీవ్రంగా కొట్టారు. నీరసంగా కిందపడిపోయిన ఆమెకు నిప్పుపెట్టారు. 90శాతం ఆమె శరీరం తగలబడిపోయిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి.. ‘వంట చేస్తుంటే నిప్పంటుకుంది’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు.


ప్రియాంక కుటుంబం ఆస్పత్రికి చేరుకున్న కాసేపటికి నిరంజన్ కుటుంబం హాస్పిటల్ నుంచి నెమ్మదిగా జారుకుంది. తమ నాలుగు నెలల బాబును తీసుకొని నిరంజన్ పరారైపోయాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా ప్రియాంక ప్రాణాలు నిలవలేదు. ఆమె మరణించింది. అప్పటికే నిరంజన్ కుటుంబం మొఖం చాటుచేయడంతో ప్రియాకం కుటుంబానికి అనుమానం వచ్చింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-07-07T23:40:58+05:30 IST