కరోనాను జయించిన ప్రేమ... బాధిత భర్తకు 45 ప్రేమ లేఖలు

ABN , First Publish Date - 2020-03-31T17:24:16+05:30 IST

నిజమైన ప్రేమకు ఏదీ అడ్డంకి కాదంటారు. కరోనా బారిన పడిన భర్త... అతని కోసం పరితపించే భార్య కథ ఇది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న భర్తను భార్య కలవలేని పరిస్థితిలో ఉంటుంది.

కరోనాను జయించిన ప్రేమ... బాధిత భర్తకు 45  ప్రేమ లేఖలు

హాంగ్‌జౌ: నిజమైన ప్రేమకు ఏదీ అడ్డంకి కాదంటారు. కరోనా బారిన పడిన భర్త... అతని కోసం పరితపించే  భార్య కథ ఇది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న భర్తను భార్య కలవలేని పరిస్థితిలో ఉంటుంది. అయితే ఈ సమయంలో ఆమె తన భర్తకు ప్రేమపూర్వక లేఖలు రాస్తూ కాలం గడిపింది. చైనాలోని హాంగ్‌జౌ నగరంలో 84 ఏళ్ల హువాంగ్ గువోకి నివసిస్తోంది . ఆమె భర్త సన్ శ్వాసకోశ సమస్యలతో ఏడాది కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హువాంగ్ తన భర్తను కలవడానికి ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్ళేది. ఆసుపత్రి సిబ్బంది ఈ జంటను 'దాది హువాంగ్' 'దాదా సన్' అని పిలిచేవారు. హువాంగ్ ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటలకు కివి పండ్లను తీసుకొని భర్తను  కలుసుకునేందుకు వచ్చేది. అయితే  ఫిబ్రవరి 1 నుండి లాక్ డౌన్ అమలయ్యింది. అయితే హువాంగ్ ప్రత్యేక అనుమతితో ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చి కివి పండ్లు, ఒక ప్రేమ లేఖను తీసుకువచ్చి, నర్సుకి ఇచ్చి వెళ్లిపోయేది. ఆ లేఖలలో ఆమె భర్తకు ధైర్యాన్ని నూరిపోసేది. మీరు ధైర్యంగా  ఉండండి పిల్లలు, మనవరాళ్లు అందరూ బాగున్నారు. నర్సులు, వైద్యులు చెప్పినట్లు నడుచుకోండి. నేను మిమ్మల్ని  అమితంగా ప్రేమిస్తున్నాను. అని రాసేది. ఇలా భర్తకు మొత్తం 45 ప్రేమ లేఖలు రాసింది. సన్ తన భార్య రాసిన ప్రేమలేఖలను చదువుతుండేవాడు. తాజాగా లాక్ డౌన్ ఎత్తివేశాక హువాంగ్ ఆసుపత్రికి వచ్చి భర్తను కలుసుకుంది. ఒకరిని ఒకరు చూసుకుని ఆనందంగా కివి పండ్లు తిన్నారు. 


Updated Date - 2020-03-31T17:24:16+05:30 IST