భర్త అస్థికలను పెట్టెలో తీసుకెళ్తున్న మహిళ.. ఎయిర్పోర్టు పోలీసులు షాక్..
ABN , First Publish Date - 2020-08-04T23:00:23+05:30 IST
జర్మనీలోని మ్యూనిక్ విమానాశ్రయంలో ఇవాళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల వృద్ధురాలు..
బెర్లిన్: జర్మనీలోని మ్యూనిక్ విమానాశ్రయంలో ఇవాళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల వృద్ధురాలు తీసుకెళ్తున్న ఓ పెట్టెను తనిఖీ చేసిన పోలీసులు అందులో మానవ అస్థికలు చూసి షాక్ అయ్యారు. ప్రాథమిక విచారణ అనంతరం అవి ఆమె భర్త అస్థికలేననీ... అధికారుల అనుమతి మేరకే తన స్వస్థలానికి వాటిని తరలిస్తోందని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. తొలుత పెట్టెను స్వాధీనం చేసుకున్న ఎయిర్పోర్టు పోలీసులు హుటాహుటిన కస్టమ్స్ అధికారులు, ఓ డాక్టర్, ప్రాసిక్యూటర్లను అక్కడికి రప్పించారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఎలాంటి నేరం జరగలేదని వారు తేల్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
పోలీసుల విచారణలో సదరు వృద్ధురాలు, 54 ఏళ్ల ఆమె కుమార్తె వెల్లడించిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ గ్రీస్ నుంచి మ్యూనిక్, కైవ్ మీదుగా అర్మేనియా వెళ్తున్నారు. తన భర్త 2008లో చనిపోగా గ్రీస్లోని థెస్సలోనికీలో ఖననం చేసినట్టు వృద్ధురాలు పేర్కొంది. ఇప్పుడు తన కుమార్తెతో కలిసి అర్మేనియాలో అంత్యక్రియలు నిర్వహించేందుకు భర్త అస్థికలను తీసుకెళ్తున్నట్టు వివరించింది. తల్లీకూతుళ్లను కొద్దిసేపు విచారించిన అనంతరం.. ఆ పెట్టెను తీసుకుని ప్రయాణించేందుకు పోలీసులు అనుమతించారు.