ఆంధ్రుల రాజధాని అమరావతే
ABN , First Publish Date - 2020-07-06T09:52:46+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అందరూ ఎంచుకోవటం జరిగిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
పిడుగురాళ్ల, జూలై 5: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అందరూ ఎంచుకోవటం జరిగిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ముందు వరకు రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన వైసీపీ నాయకులు ఎన్నికల తర్వాత మాటమార్చి మూడు ముక్కలాట ఆడటం దుర్మార్గమన్నారు. రాజధాని సమస్య 200 ఇళ్లకే పరిమితమైందనడం వైసీపీ వారి అహంకారానికి నిదర్శనమన్నారు. జిల్లాలో పుట్టి పెరిగి రాజధాని గురించి తక్కువగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలైన వారిని సమాజం నుంచి వెలివెయ్యాలన్నారు. కన్నతల్లిలాంటి రాజధానికి ఎన్నో కష్టాలు తెస్తున్న వైసీపీ నాయకులను వచ్చే ఎన్నికల్లో ప్రజలే పాతిపెడతారన్నారు.
రాజధానిలో టీడీపీ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఫ్యాక్షనిస్టు స్వభావం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఇంతకన్నా ఎలా బాగుంటుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. 200 రోజులుగా అమరావతి రైతులు దీక్ష చేస్తున్నారని వారందరికీ సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చంద్రబాబు హయాంలో రాజధాని అంతా గ్రాఫిక్సేనని చెప్పిన వైసీపీ మంత్రులు గత వారం అమరావతిలో భవన నిర్మాణాలను చూసి నోరు వెళ్లబెట్టారన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రుల రాజధాని అమరావతిగా ఉండే విధంగా ప్రకటించాలని తెలిపారు.