త్వరలో హైదరాబాద్ వస్తున్నా.. పెళ్లి చేసుకుందామని నమ్మించి..
ABN , First Publish Date - 2021-05-07T17:47:49+05:30 IST
త్వరలో హైదరాబాద్కు వస్తున్నానని, పెళ్లి చేసుకుందామని నమ్మించి..
- పెళ్లి పేరిట మోసం
- రూ.2లక్షలు కాజేసిన యువకుడు
హైదరాబాద్/రాజేంద్రనగర్ : వివాహ పరిచయ వేదిక ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఓ యువతి నుంచి రూ. 2లక్షలు దోచుకున్నాడు. కిస్మత్పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి(24) ఓ వివాహ పరిచయ వేదికలో తన వివరాలు నమోదు చేసుకుంది. ఓ వ్యక్తి ఫోన్ చేసి రష్యాలో ఉద్యోగం చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. త్వరలో హైదరాబాద్కు వస్తున్నానని, పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. ఇటీవల ఆమెకు ఓ బహుమతి పంపిస్తున్నట్లు చెప్పాడు.
అతడు చెప్పిన మరుసటి రోజు విమానాశ్రయం నుంచి ఫోన్ చేస్తున్నామని మరో వ్యక్తి సదరు యువతికి ఫోన్ చేశాడు. ఆమెకు విలువైన బహుమతి వచ్చిందని రూ.2లక్షలు చెల్లిస్తే బహుమతి పంపిస్తామని చెప్పడంతో యువతి మూడు దఫాలుగా రూ. 2లక్షలు వారి ఖాతాలో జమ చేసింది. తర్వాత ఎంతకీ డబ్బు తీసుకున్న వారు స్పందించకపోవడంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కె.కనకయ్య తెలిపారు.