Share News

Harishrao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా..: హరీష్ రావు

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:13 PM

సంగారెడ్డి జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయమని.. ఆయన ఇచ్చిన సవాలును తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా బుధవారం హరీష్ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ..

Harishrao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా..: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్‌ను (Challenge) స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) హరీష్ రావు (Harish Rao) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయమని.. ఆయన ఇచ్చిన సవాలును తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా బుధవారం హరీష్ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ లోపు ఏకకాలంలో రైతు ఋణమాఫీ (Farmer loan waiver) చేసి, ఆరు గ్యారెంటీలు (Six Guarantees) అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా (Resignation) చేస్తానని.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని.. తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాను శుక్రవారం (ఎల్లుండి) అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్దకు చర్చకు వస్తానని.. సీఎం రేవంత్ కూడా రావాలని హరీష్ రావు అన్నారు.


కాగా రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ నేతలు విసురుతున్న సవాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూటిగా స్పందించారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటానని, మీరు బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తారా? అని ప్రతి సవాల్‌ విసిరారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తనకు సవాల్‌ విసిరారని, అటు సూర్యుడు ఇటు పొడిచినా రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు. లంబాడ గిరిజనుల ఆరాధ్య దైవాలైన బావోజీ, సేవాలాల్‌ల సాక్షిగా ఆగస్టు 15లోగా అది జరుగుతుందని పునరుద్ఘాటించారు. తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో హరీశ్‌రావు తన మామ కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తాను రుణమాఫీ చేస్తే.. బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తారా? అని హరీశ్‌కు సీఎం ప్రతి సవాల్‌ విసిరారు.


మంగళవారం నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో నిర్వహించిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తాము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలకుగాను ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, కేసీఆర్‌ పదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఏ హామీనీ కేసీఆర్‌ అమలు చేయలేదన్నారు. రెండుసార్లు చేసిన రుణ మాఫీ మిత్తికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లు ఏ హామీ అమలు చేయని కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో కోదండం వేయాల్సిన అవసరం ఉందన్నారు. తాగుబోతు అప్పుల సంసారంలాగా రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్‌ను తనకు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పగించారని, బాధ్యతగా వ్యవహరిస్తూ నాలుగు నెలల్లో రూ. 26 వేల కోట్ల కిస్తీలు, మిత్తి చెల్లించానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతీ నెల మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి రూ.1369 కోట్లు ఆర్టీసీకి చెల్లించామని వివరించారు. రూ.500లకు సిలిండర్‌ పథకం కింద రాష్ట్రంలో 40 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నామని, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు పథకం కింద 44 లక్షల ఇళ్లలో వెలుగులు నింపుతున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయకపోతే తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 22,500 కోట్లు కేటాయించి 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు.


రైతులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు!

రైతుల రుణాల వసూళ్ల కోసం డీసీసీబీ తదితర బ్యాంకులు రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఏ అధికారి ఒత్తిడి చేసినా ప్రభుత్వం సీరియ్‌సగా పరిగణిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అసలు, మిత్తి నయా పైసలతో సహా చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రూ.500 బోన్‌సగా ఇచ్చి మరీ ప్రతీ గింజను కొంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెనుకొండలో వైసీపీకి భారీ షాక్..

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

మనసులో మర్మాన్ని బయటపెట్టిన సీఎం జగన్: రామకృష్ణ

డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు

జగన్‌కు మరో షాక్‌!

కడప జిల్లా కోర్టు గీత దాటింది!

Read Latest AP News and Telugu News

National News, Telangana News, Sports News

Updated Date - Apr 24 , 2024 | 01:16 PM