Sri Sathya Sai Dist.: మంత్రి పెద్దిరెడ్డి ఫ్లెక్సీలను చింపేసిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2022-12-15T16:17:34+05:30 IST

మడకశిర నియోజకవర్గం వైసీపీ (YCP)లో విబేధాలు భగ్గుమన్నాయి. వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరుకానుండడంతో ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

Sri Sathya Sai Dist.: మంత్రి పెద్దిరెడ్డి ఫ్లెక్సీలను చింపేసిన వైసీపీ నేతలు

శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర (Madakasira) నియోజకవర్గం వైసీపీ (YCP)లో విబేధాలు భగ్గుమన్నాయి. వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) హాజరుకానుండడంతో ఎమ్మెల్యే తిప్పేస్వామి (MLA Thippeswamy) వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే మడకశిరలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీంతో స్థానిక వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి పెద్ది రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి అసమ్మతి వర్గం నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డిని ఆహ్వానిస్తూ మడకశిర పట్టణం ప్రధాన కూడలిలో తిప్పేస్వామి వర్గీయులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి వాటిని చింపేశారు. ఇది తిప్పేస్వామి వ్యతిరేకవర్గీయుల పనేనంటూ వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. వైసీపీ నేతల మధ్య ఉన్న విబేధాల కారణంగానే నియోజకవర్గంలో ఈ తరహా ఇబ్బందులు ఏర్పడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్ది రెడ్డి గురువారం మడకశిర పట్టణానికి చేరుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి మంత్రికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి తన అనుచరులతో ఒక చోట మంత్రికి స్వాగతం పలకగా, మరోవర్గం శ్రేణులు కల్లూరు శివారులో పెద్దిరెడ్డికి స్వాగతం పలికారు.

Updated Date - 2022-12-15T16:17:37+05:30 IST