40కోళ్లతో మొదలైన ప్రస్థానం.. పాకెట్ మనీ కోసం ఇంట్లోని గుడ్లు అమ్మిన 9ఏళ్ల బుడ్డోడు.. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడంటే..

ABN , First Publish Date - 2022-10-25T16:31:25+05:30 IST

తొమ్మిదేళ్ల వయసు పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది. రోజూ స్కూల్‌కు వెళ్లడం, తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో తినుబండారాలు కొనుక్కోవడం, సాయంత్రం తోటి పిల్లలతో ఆడుకోవడం.. ఆ వయసు పిల్లల దినచర్య దాదాపు ఇలాగే ఉంటుంది. కొందరు పిల్లలు పాకెట్ మనీ ఇవ్వకపోతే అలగడం, కొన్ని సమయాల్లో పట్టుబట్టి మరీ తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకోవడం చేస్తుంటారు. కానీ..

40కోళ్లతో మొదలైన ప్రస్థానం.. పాకెట్ మనీ కోసం ఇంట్లోని గుడ్లు అమ్మిన 9ఏళ్ల బుడ్డోడు.. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడంటే..

తొమ్మిదేళ్ల వయసు పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది. రోజూ స్కూల్‌కు వెళ్లడం, తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో తినుబండారాలు కొనుక్కోవడం, సాయంత్రం తోటి పిల్లలతో ఆడుకోవడం.. ఆ వయసు పిల్లల దినచర్య దాదాపు ఇలాగే ఉంటుంది. కొందరు పిల్లలు పాకెట్ మనీ ఇవ్వకపోతే అలగడం, కొన్ని సమయాల్లో పట్టుబట్టి మరీ తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకోవడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుడ్డోడు మాత్రం.. ఇందుకు పూర్తి విరుద్ధం. పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కోడి గుడ్లను విక్రయించడం మొదలెట్టాడు. 40కోళ్లతో మొదలైన అతడి ప్రస్తానం.. ప్రస్తుతం పది మందికి ఉపాధి కలిగించే స్థాయికి చేరింది. ఇంతకీ ఈ బాలుడు ఎవరు, అతడి వ్యాపారం ఎలా మొదలైంది.. తదితర వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాకు (Australia) చెందిన జోష్ ముర్రే అనే కుర్రాడి కుటుంబం 2008లో విక్టోరియాలోని కెర్రీవ్యాలీలోని ఓ ఇంటికి మారింది. ఆ సమయంలో జోష్ ముర్రే ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు. కొత్త ఇంటికి మారిన సమయంలో ఆ ఇంటి యజమాని 40 కోళ్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. జోష్ తల్లిదండ్రులు వాటిని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. అయితే జోష్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కోళ్లను పెంచుకుందామంటూ తల్లిదండ్రులను ఒప్పించాడు. కోళ్లకు ఆహారం పెట్టడం, వాటి గదిని శుభ్రం చేయడం తదితర పనులన్నింటినీ జోష్ చూసుకునేవాడు. తర్వాత కొన్నాళ్లకు పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా.. సొంతంగా ఏదైనా చేయాలని భావించాడు. వెంటనే ఆ బుడ్డోడికి కోడి గుడ్లపై దృష్టి పడింది.


ముందుగా కొన్ని గుడ్లను తీసుకుని ఇరుగుపొరుగు వారికి విక్రయించాడు. ఆ డబ్బుల్లో కొంత తన ఖర్చుకు పెట్టుకుని, మిగతా మొత్తాన్ని ఇంట్లో ఇచ్చేవాడు. తర్వాత కొన్నాళ్లకు స్థానిక దుకాణదారులు, రైతు బజార్లకు వెళ్లి తమ గుడ్లు తీసుకోవాలంటూ ప్రచారం చేసేవాడు. ఇలా చిన్న వయసులోనే జోష్.. చాలా మంది కస్టమర్లను సంపాదించాడు. అప్పటినుంచి అతడి సంపాదన ఏడాదికి సుమారు రూ.8లక్షలకు పెరిగింది. కొడుకు ఆలోచన పని చేయడంతో అతడి తల్లి టెంసిన్ కూడా మద్దతుగా నిలిచింది. తర్వాత జోష్ రెయిన్ బో ఎగ్స్ (Josh Rainbow Eggs) అనే కంపెనీని ప్రారంభించి, పూర్తి స్థాయిలో గుడ్ల వ్యాపారంలోకి (Egg business) దిగారు. 2012లో మొదటగా గుడ్లను సేకరించేందుకు సిబ్బందిని నియమించుకున్నారు. 2013నాటికి జోష్ కంపెనీలో 2వేలుగా ఉన్న కోళ్లు.. 2015నాటికి పది వేలకు పెరిగాయి.

జోష్ ముర్రేకి 13ఏళ్లు వచ్చేసరికి అతడి వద్ద 8మంది సిబ్బంది పని చేసేవారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందడంతో అనంతరం కాలంలో కోళ్ల పెంపకానికి 250 ఎకరాల పొలం కొనుగోలు చేశారు. అదే సమయంలో జోష్ చాలా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ తర్వాత వీరి గుడ్లు సూపర్ మార్కెట్లలో కూడా విక్రయించేవారు. జోష్‌కు ప్రస్తుతం 21ఏళ్లు కాగా.. తల్లిదండ్రులతో కలిసి వ్యాపారం చూసుకుంటూనే మరోవైపు మార్కెటింగ్‌కు సంబంధించిన విద్యనభ్యసిస్తున్నాడు. 2020-2021 సంవత్సరంలో జోష్ కంపెనీ సుమారు రూ.28కోట్ల వ్యాపారం చేసింది. అలాగే ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. 21ఏళ్ల వయసులోనే ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్న జోష్.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Updated Date - 2022-10-25T16:31:29+05:30 IST