Prakasam Dist.: సీఎం మమ్మల్ని మోసం చేసారు.. లోకేష్‌తో గ్రానైట్ రంగం ప్రతినిధులు

ABN , First Publish Date - 2023-07-28T15:34:28+05:30 IST

ప్రకాశం జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా, ఒంగోలులో గ్రానైట్ రంగం ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Prakasam Dist.: సీఎం మమ్మల్ని మోసం చేసారు.. లోకేష్‌తో గ్రానైట్ రంగం ప్రతినిధులు

ప్రకాశం జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా, ఒంగోలులో గ్రానైట్ రంగం (Granite Sector) ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

గ్రానైట్ ప్రతినిధులు మాట్లాడుతూ..

టీడీపీ (TDP) హయాంలో రూ. 4 ఉన్న యూనిట్ విద్యుత్ ధర.. జగన్ పాలనలో రూ.7కు పెరిగిపోయిందని, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసారన్నారు. 4 లక్షల మందికి ఉపాధిగా ఉన్న చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమను జగన్ (Jagan) నాశనం చేశారన్నారు. జగన్ పాలనలో 800 ఫ్యాక్టరీల్లో సగం మూతపడ్డాయని, గ్రానైట్ ఎక్స్ పోర్ట్ చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు అదానీకి ఇచ్చి ఇతర కంపెనీల కంటైనర్లు రాకుండా చెయ్యడం వలన ఎక్స్ పోర్ట్‌పై ఒక్కో కంపెనీకి రూ.60 వేలు అదనంగా ఖర్చు అవుతుందని వారు వాపోయారు. రాయల్టీ తగ్గిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్... ఇప్పుడు వంద శాతం పెంచి మా పొట్ట కొట్టారన్నారు. మైనింగ్ యాజమానులపై విపరీతమైన ఫైన్లు వేసి వేధిస్తున్నారని, గ్రానైట్ ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని ముఖ్యమంత్రి దెబ్బతీశారన్నారు. మరోవైపు ఓవర్ లోడ్ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని, ఫైన్లు విపరీతంగా పెంచేశారని, రూ.2 వేలు ఉన్న ఓనర్ పెనాల్టీని జగన్ రూ.20 వేలు చేశారన్నారు. టన్నుపై వెయ్యి ఉన్న పెనాల్టీ జగన్ రెండు వేలు చేసారని, 400 లారీలు గతంలో తిరిగేవని, ఇప్పుడు కేవలం 40 లారీలు తిరిగే పరిస్థితి వచ్చిందని గ్రానైట్ రంగం ప్రతినిధులు లోకేష్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు.

వారి సమస్యలపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ...

దోపిడీదార్లు, పేదలకి మధ్య యుద్ధం జరుగుతోందని, దోపిడీదారు జగన్ పాలనలో అన్ని రంగాల ప్రజలు బాధితులేనని అన్నారు. మైనింగ్ రంగంపై ఆధారపడిన వారు కూడా జగన్ బాధితులేనన్నారు. జగన్ పాలనలో జనం భయంతో బ్రతుకుతున్నారని, గ్రానైట్ పరిశ్రమపై రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, అలాంటి రంగాన్ని జగన్ దెబ్బకొట్టారన్నారు. జగన్ మైనింగ్ కంపెనీ కోసం రాష్ట్రంలో ఉన్న ఇతర అన్ని మైనింగ్ యజమానులను వేధిస్తున్నారని, గ్రానైట్‌ని ఇండస్ట్రీగా గుర్తించి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చింది టీడీపీయేనన్నారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ గ్రానైట్ పరిశ్రమను వేధించలేదన్నారు. జగన్ గ్రానైట్ పరిశ్రమను మోసం చేసి సంక్షోభంలోకి నెట్టేసారని విమర్శించారు.

రాష్ట్రంలో జగన్ మైనింగ్ కంపెనీ తప్ప వేరే కంపెనీ ఉండకూడదనే ఉద్దేశంతో అందరినీ వేధిస్తున్నారని లోకేష్ అన్నారు. జీవో 42 తెచ్చి రాయల్టీని వంద శాతం పెంచారని, జీవో 65 తెచ్చి డెడ్ రెంట్‌ని 10 రెట్లు పెంచేసారన్నారు. సెక్యూరిటీ డిపాజిట్ 3 రెట్లు పెంచారని ఆరోపించారు. జీవో 90 తీసుకొచ్చి మైనింగ్ కంపల్సరీ పేరుతో ముందే పన్నులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ చీమకుర్తి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారని, రాయల్టీ, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన గ్రానైట్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న మంచి పాలసీలు అధ్యయనం చేసి మెరుగైన పాలసీ అమలు చేస్తామని, అలాగే కరెంట్ ఛార్జీలు తగ్గించి గతంలో ఇచ్చిన రేటుకే విద్యుత్ అందిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-28T15:34:28+05:30 IST