AP News: పాపం ఆ చిన్నారులు.. ఏం చేశారో తెలియదు.. కానీ టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా..
ABN , First Publish Date - 2023-02-22T09:59:45+05:30 IST
విద్యార్థులకు పాఠాలు చెప్పి.. వారి భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన టీచర్లే వారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.
విశాఖపట్నం: విద్యార్థుల (Students)కు పాఠాలు చెప్పి.. వారి భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన టీచర్లే (Teachers) వారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు తాము చెప్పిన విధంగా నడుచుకోవడం లేదంటూ పనిష్మెంట్ పేరుతో విద్యార్థులను కొందరు టీచర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనే నగరంలోని సీతమ్మధార కార్పొరేట్ స్కూల్లో (Sitammadhara Corporate School) చోటు చేసుకుంది. మండుటెండలో చెప్పులు లేకుండా విద్యార్థులను నిలబెట్టారు. విద్యార్థులను అలా చెప్పులు లేకుండా ఎండలో నిలుచోబెట్టడం తప్పంటూ ఓ వ్యక్తి ఆ దృశ్యాలను చిత్రీకరించారు. అయితే వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై స్కూల్ టీచర్ రెచ్చిపోయారు. పిల్లలకు పనిష్మెంట్ ఇస్తుంటే వీడియో తీయడానికి మీకేమి అవసరం అంటూ టీచర్ దురుసుగా ప్రవర్తించారు.
అటుగా వెళ్లే కొందరు వ్యక్తులు మానవాదృక్పధంతో స్కూల్ బయట పిల్లలను నిలబెట్టడంపై టీచర్ను ప్రశ్నించారు. పనిష్మెంట్ ఇచ్చే విధానాలు ఇవి కాదని, క్లాస్రూమ్లలో కూడా పనిష్మెంట్లు ఇచ్చుకోవచ్చని అన్నారు. అయినప్పటికీ ఆ టీచర్ పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వడంలో వెనక్కి తగ్గలేదు. విద్యార్థులు ఎండలో నిల్చున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి ఘటనలపై విద్యాశాఖ అధికారులు స్పందించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే పిల్లలు చేసిన తప్పేంటి అనేది తెలియాల్సి ఉంది.
