Goa Casino: పాతిక లక్షలు గెలిచారు.. పాత మిత్రులు దోచారు..

ABN , First Publish Date - 2023-08-12T11:05:27+05:30 IST

పాతిక లక్షలు గెలిచిన సంతోషం పాతిక రోజులైనా నిలవలేదు పాపం.. నగరంలో చాయ్‌ అమ్ముతూ జీవనం సాగించే తిలక్‌ ఎం మణికంఠకు

Goa Casino: పాతిక లక్షలు గెలిచారు.. పాత మిత్రులు దోచారు..

- గోవా కేసినోలో రూ.25 లక్షలు గెలుచుకున్న చాయ్‌వాలా

- కిడ్నాప్‌ చేసి రూ.15 లక్షలు దోచుకున్న మిత్రులు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పాతిక లక్షలు గెలిచిన సంతోషం పాతిక రోజులైనా నిలవలేదు పాపం.. నగరంలో చాయ్‌ అమ్ముతూ జీవనం సాగించే తిలక్‌ ఎం మణికంఠకు అనుకోని అదృష్టం కలసి వచ్చింది. అయితే ఆ సంతృప్తి ఎక్కువసేపు నిలవలేదు. నగరంలోని త్యాగరాజనగర్‌కు చెందిన తిలక్‌ ఎం మణికంఠ జూలై 30న మిత్రులతో కలసి గోవా(Goa) వెళ్లాడు. పనాజీలోని మెజస్టిక్‌ ప్రైడ్‌ కేసినోలో ఏకంగా రూ.25లక్షలు గెలుపొందారు. మిత్రులకు తెలిస్తే ఇబ్బంది కలిగిస్తారని గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకున్నారు. ఆ తర్వాత మిత్రులకు కనిపించకుండా మరోచోట ఉన్నానంటూ నాలుగు రోజులు గడిపారు. ఈనెల 5న బెంగళూరు(Bangalore)కు మణికంఠ తిరిగి వచ్చారు. మణికంఠ డబ్బులు గెలుచుకున్న విషయాన్ని మిత్రులు పసిగట్టారు. మణికంఠ(Manikanta) ఇంటి సమీపంలోని ఓ దుకాణం వద్దకు సిగరెట్‌కోసం వెళ్లగా అతడి స్నేహితుడు కార్తీక్‌, పాండు, ఈశ్వర్‌, నిశ్చల్‌తోపాటు మరికొందరు బయటకు వెళ్దామంటూ బలవంతం చేశారు. ఇంట్లో పని ఉందని, ఇప్పుడు రాలేనంటూ మణికంఠ చెబుతున్నా పట్టించుకోకుండా కారులో బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. బెంగళూరు యూనివర్సిటీ ప్రాంతానికి తీసుకెళ్లి మొబైల్‌ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రూ.15లక్షలు బదిలీ చేయించుకున్నారు. మరుసటి రోజు వరకు కారులోనే పలు ప్రాంతాల్లో తిప్పి వదిలేశారు. అదే రోజున మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు హనుమంతనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న వారికోసం గాలింపు సాగిస్తున్నారు.

Updated Date - 2023-08-12T11:05:27+05:30 IST