Share News

Australia:ఆస్ట్రేలియాలో కుప్పకూలిన విమానం.. అడవిలో మంటలార్పుతున్న సమయంలో ఘటన

ABN , First Publish Date - 2023-11-04T21:30:26+05:30 IST

ఆస్ట్రేలియాలోని(Australia) ఓ అడవిలో రాజుకున్న మంటలను ఆర్పడానికి వెళ్లిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వీన్స్‌లాండ్(Queensland) రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌కు వాయువ్యంగా 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుట్‌బ్యాక్ మెకిన్‌లే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Australia:ఆస్ట్రేలియాలో కుప్పకూలిన విమానం.. అడవిలో మంటలార్పుతున్న సమయంలో ఘటన

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని(Australia) ఓ అడవిలో రాజుకున్న మంటలను ఆర్పడానికి వెళ్లిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వీన్స్‌లాండ్(Queensland) రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌కు వాయువ్యంగా 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుట్‌బ్యాక్ మెకిన్‌లే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అడవిలో చెలరేగిన మంటలు ఆర్పడానికి విమానంలో ముగ్గురు బయల్దేరారు. ఇందులో ఒక పైలెట్ తో పాటు ఇద్దరు మంటలార్పే సిబ్బంది ఉన్నారు. మెకిన్ సమీపంలోకి రాగానే వారి ఫ్లైట్ అకస్మాత్తుగా కిందకు దూసుకెళ్లి.. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ప్రమాదంలో అందులో ఉన్న ముగ్గురూ మరణించారు. ఘటన జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో తెలిపింది. మరింత లోతుగా విచారించడానికి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని వెల్లడించింది.


"క్వీన్స్‌ల్యాండ్‌లో మంటల్ని ఆర్పడానికి పని చేస్తున్న ముగ్గురు ధైర్యవంతులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం" అని ప్రధాని ఆంథోనీ అల్బనీస్(Anthony Albanese) ఎక్స్‌లో(X) పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నందునా వాటిని అదుపులోకి తేవడానికి ఈ విమానాల్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు ఫ్లైట్స్ క్రాష్ అవుతున్నాయి. ఉత్తర క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో చాలా చోట్ల బుష్‌ఫైర్‌లు(Bush Firing) అదుపులోకి రాకపోవడంతో నవంబర్ 1న ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు.ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి అగ్నిమాపకదళాలు రంగంలోకి దిగి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. 2019 నుంచి ఆస్ట్రేలియాలోని చాలా అడవులు అగ్నికి ఆహుతిఅవుతున్నాయి. మంటల్లో చాలా వన్యమృగాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ మంటలు జనావాసాల్ని కూడా చుట్టుముడుతున్నాయి. మంటల వల్ల చెలరేగిన పొగతో దేశంలోని చాలా నగరాలు విషపూరిత వాయు ఉద్గారాల సమస్యను ఎదుర్కొంటున్నాయి.

Updated Date - 2023-11-04T21:31:47+05:30 IST