Udhaynidhi Stalin: నా తలకు రూ.10 కోట్లు అక్కర్లేదు, పది రూపాయల దువ్వెన చాలు..

ABN , First Publish Date - 2023-09-05T16:24:45+05:30 IST

అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య తన తల నరికి తెచ్చివారికి రూ.10 కోట్లు ఇస్తామంటూ రివార్డు ప్రకటించడంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.తన తలకు రూ.10 కోట్లు అవసరం లేదని, రూ.10 రూపాయల దువ్వెన చాలని వ్యాఖ్యానించారు.

Udhaynidhi Stalin: నా తలకు రూ.10 కోట్లు అక్కర్లేదు, పది రూపాయల దువ్వెన చాలు..

చెన్నై: అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య (Paramhans Acharya) తన తల నరికి తెచ్చివారికి రూ.10 కోట్లు ఇస్తామంటూ రివార్డు ప్రకటించడంపై డీఎంకే మంత్రి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) స్పందించారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకు తన తల గొరిగించేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరమహంస ఆచార్య రూ.10 కోట్లు ఇస్తామని ప్రకటించారని, అయితే తన తలకు రూ.10 కోట్లు అవసరం లేదని, రూ.10 రూపాయల దువ్వెన చాలని వ్యాఖ్యానించారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్తేమీ కాదని, వాటికి భయపడేది లేదని అన్నారు. తమిళ్ కోసం తన తలను రైలు ట్రాక్‌పై ఉంచిన కరుణానిధి మనవడినని అన్నారు.


దీనికి ముందు, సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు అయోధ్య సాధువు పరమహంస ఆచార్య గత ఆదివారంనాడు బెదిరింపు హెచ్చరిక చేశారు. ఉదయనిధి తలకు రూ.10 కోట్లు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు. ఉదయనిధి పోస్టర్‌ను ఒక చేత్తో, పొడవాడి కత్తిని మరో చేత్తో ఆయన పట్టుకున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఉదయనిధి స్టాలిన్ గత శనివారంనాడు ఒక కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీతో పోలుస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. ఆయన వాఖ్యలపై బీజేపీ, హిందూ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

Updated Date - 2023-09-05T16:24:45+05:30 IST