Share News

Haryana: కల్తీ మద్యం తాగి 19 మంది మృతి.. నిందితుల్లో కాంగ్రెస్, జేజేపీ లీడర్లు

ABN , First Publish Date - 2023-11-11T13:04:04+05:30 IST

Toxic Liquor: హరియాణా(Haryana)లో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యం(Toxic Liquor)సేవించి తాజాగా 19 మంది మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు ప్రధాన నిందితులుగా గుర్తిస్తూ 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Haryana: కల్తీ మద్యం తాగి 19 మంది మృతి.. నిందితుల్లో కాంగ్రెస్, జేజేపీ లీడర్లు

చండీగఢ్: హరియాణా(Haryana)లో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యం(Toxic Liquor)సేవించి తాజాగా 19 మంది మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు ప్రధాన నిందితులుగా గుర్తిస్తూ 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. యమునానగర్‌లోని మండేబరి, పంజేటో కా మజ్రా, ఫ్రూస్‌గఢ్, సరన్ గ్రామాలు, పొరుగున ఉన్న అంబాలా జిల్లా గ్రామాల్లోని పలు షాపులకు కల్తీ మద్యం సరఫరా చేశారు. అది తాగిన 19 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత గ్రామస్థులు మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ఓ కాంగ్రెస్ నేత, జననాయక్ జనతా పార్టీ (JJP) నేత కుమారుడితోపాటు మరో అయిదుగురు ఉన్నారు. ఈ ఘటన రాజకీయ వేడిని రాజేసింది. హరియాణా పౌరులు ఏళ్లుగా కల్తీ మద్యం బారిన పడుతున్నా.. ప్రభుత్వం స్పందించట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్(Manoharlal Khattar) కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డాయి.


బాధితుల ఆర్తనాదాలు..

బాధిత కుటుంబాల్లో చాలా మంది ఇంటి పెద్దను కోల్పోయారు. వారిలో ఒకరి కుమారుడు మాట్లాడుతూ "మా నాన్న మద్యానికి బానిస అయ్యాడు. గత రాత్రి మద్యం తాగి చనిపోయాడు. కానీ ఎప్పుడూ తక్కువ మోతాదులో తీసుకుంటాడు. కల్తీ మద్యమే మా నాన్న ప్రాణాలు తీసింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 7 మంది అనుమానితులతోపాటు మరి కొందరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గ్రామస్తులు మాత్రం మద్యం వ్యాపారులపై బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతున్నారు.

"నాకు భయంగా ఉంది. మేం నోరు విప్పితే మా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది" అని ఒక గ్రామస్థుడు చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. మృతుల్లో ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) వలస కూలీలు ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంబాలా పోలీసులు పాడుబడిన ఫ్యాక్టరీలో తయారు చేసిన 200 డ్రమ్ములు, కల్తీ మద్యం తయారీకి వినియోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు యమునానగర్‌‌కు కల్తీ మద్యాన్ని సరఫరా చేసినట్లు తెలుస్తోంది. కేసు విచారణ నిమిత్తం యమునానగర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-11-11T13:04:38+05:30 IST