Share News

Uttarkashi Tunnel: 17 రోజుల ఎదురుచూపులకు శుభం కార్డు.. టన్నెల్ నుంచి బయటకొచ్చిన కార్మికులు

ABN , First Publish Date - 2023-11-28T20:08:41+05:30 IST

ఒకటి కాదు, రెండో కాదు.. ఏకంగా 17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఇన్నిరోజుల పాటు టన్నెల్‌లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు.

Uttarkashi Tunnel: 17 రోజుల ఎదురుచూపులకు శుభం కార్డు.. టన్నెల్ నుంచి బయటకొచ్చిన కార్మికులు

Uttarkashi Tunnel Operation: ఒకటి కాదు, రెండో కాదు.. ఏకంగా 17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఇన్నిరోజుల పాటు టన్నెల్‌లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ (UttaraKashi Rescue Operation) విజయవంతమైంది. నిర్మాణం దశలో ఉన్న సొరంగం ప్రమాదవశాత్తూ కూలడంతో.. 17 రోజులపాటు భూగర్భ బందీలుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు ప్రాణాలతో బయటకొచ్చారు. రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా కాపాడాయి. స్ట్రెచర్ సహాయంతో ఒకరి తర్వాత మరొకరిని బయటకి తీసుకొచ్చారు.


ఈ ఆపరేషన్‌లో భాగంగా రెస్క్యూ బృందాలు చేపట్టిన ‘ర్యాట్ హోల్ మైనింగ్’ టెక్నిక్.. ఈ రెస్క్యూ విజయవంతం అవ్వడానికి కారణమైంది. అత్యాధునిక మెషిన్లు, ఆగర్లు విఫలమైన చోట.. నిపుణుల సలహాతో ప్రారంభించిన ఈ ‘ర్యాట్ హోల్ మైనింగ్’ వేగంగానే కార్మికులను చేరుకుంది. డ్రిల్లింగ్ తర్వాత పైపింగ్ చేశారు. అనంతరం స్ట్రెచర్ ద్వారా కార్మికులను బయటకు తీసుకురావడం జరిగింది. ఈ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల్లో ఎక్కువ మంది జార్ఖండ్ వాసులే ఉన్నారు. 41 మందిలో 15 మంది కూలీలు జార్ఖండ్‌కు చెందిన వారు కాగా.. ఏడుగురు ఉత్తరప్రదేశ్, 5 మంది బీహార్, 5 మంది ఒడిశా, ముగ్గురు పశ్చిమ బెంగాల్, ముగ్గురు ఉత్తరాఖండ్, ఇద్దరు అస్సాం, హిమాచల్ ప్రదేశ్ నుండి ఒకరు ఉన్నారు. ఈ సొరంగంలో నుంచి బయటకు వచ్చిన కూలీలను ఉత్తరాఖండ్‌లోని చిన్యాలిసౌర్ ఆసుపత్రికి తరలించారు. వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారా? లేదా? అనేది పరీక్షించి.. తదగిన వైద్య సలహాలు ఇచ్చి.. ఇంటికి పంపనున్నారు.

ఇదిలావుండగా.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గత కొన్ని రోజులుగా ఘటనా స్థలంలోనే ఉంటూ, పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. కార్మికుల కుటుంబాలతోనూ మాట్లాడారు. ఇక కార్మికులను బయటకు తీసుకొచ్చిన అనంతరం ధామి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మొత్తం 52 మీటర్ల పైపులు వేశామన్నారు. అందరూ సురక్షితంగా బయటపడాలని తాను ప్రార్థించానన్నారు.

Updated Date - 2023-11-28T20:09:04+05:30 IST