Adani Row: మోదీని టార్గెట్ చేస్తున్న విదేశీ శక్తులు, బిలియనీర్ జార్జి సోరోస్‌పై స్మృతి ఫైర్

ABN , First Publish Date - 2023-02-17T14:26:15+05:30 IST

అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ..

Adani Row: మోదీని టార్గెట్ చేస్తున్న విదేశీ శక్తులు, బిలియనీర్ జార్జి సోరోస్‌పై స్మృతి ఫైర్

న్యూఢిల్లీ: అదానీ అంశంపై (Adani issue) అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ (George Soros) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మండిపడ్డారు. కొన్ని విదేశీ శక్తులు మన ప్రజాస్వామ్యాన్ని టార్గెట్ చేసుకుని బలహీన పరచేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జార్జి సోరోస్ తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలనుకోవడం ఆయన ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తోందని ఆన్నారు. ప్రధాని మోదీ వంటి వారిని టార్గెట్‌గా చేసుకునేందుకే ఆయన బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించినట్టు మంత్రి విమర్శించారు.

ఇండియాలో ప్రతి ఐదేళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నామని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. దేశ ప్రజాస్వామ్యం ఎప్పటికీ చెక్కుచెదరదని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచేందుకు ఎవరెన్ని దుష్ట పన్నాగాలు పన్నినా ప్రధాని మోదీ నాయకత్వంలో బలంగా ఎదుర్కుంటామని అన్నారు. జార్జి సోరోస్ తన శక్తియుక్తులను ఇండియాకు కాకుండా తన దేశానికి లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తుంటారని, అదానీ గ్రూప్ అంశంపై ఆయన ఆలోచనా ప్రక్రియ, ప్రకటనలను భారతీయులంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

''ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంపై ప్రధాని మోదీని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో పాటు, ఇంగ్లాడ్ ప్రధాని బహిరంగంగా ప్రశంసించారు. ఇలాంటి తరుణంలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారు వ్యాఖ్యలు వెలుగుచూశాయి'' అని స్మృతి ఇరానీ అన్నారు. జార్జి సోరోస్ ఎవరికి నిధులు ఇస్తున్నారనే విషయం మీడియా వ్యక్తులందరికీ బాగా తెలుసునని, ఆయన మోదీని లక్ష్యంగా చేసుకున్నారని, భవిష్యత్తులో కూడా ఆయన టార్గెట్ అదే విధంగా ఉండబోతోందని చెప్పారు.

సోరోస్ ఏమన్నారు?

గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో తలెత్తిన అలజడితో స్టాక్ మార్కెట్ కుదేలయిందని, పెట్టుబడి అవకాశాలకు తలుపులు బార్లా తెరిచిన ఇండియాపై విశ్వాసానికి ఇది కుదుపులాంటిందని, మరిన్ని సంస్థాగత సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని జార్జి సోరోస్ అన్నారు. ఇండియాలో పెట్టుబడిదారుల విశ్వాసానికి విఘాతం కలిగించే విధంగా అదానీపై ఇటీవల హిండెన్ బర్గ్ వ్యాఖ్యలు చేసిన క్రమంలో జార్జి సోరోస్ తాజా వ్యాఖ్యలు చేశారు. అదానీ వ్యవహారంపై మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా జార్జి సోరోస్ ప్రశ్నించారు. విదేశీ పెట్టుబదిదారుల ప్రశ్నలకు, పార్లమెంటులోనూ ఆయన (మోదీ) సమాధానం ఇవ్వాలని అన్నారు.

జార్జి సోరోస్ ఎవరు?

ప్రపంచ బిలియనీర్ సోరోస్ ఆస్తి విలువ 8.5 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు. ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం, వాక్ స్వేచ్ఛను ప్రమోట్ చేసే సంస్థలు, వ్యక్తులకు గ్రాంట్స్ ఇస్తుంటారు.

Updated Date - 2023-02-17T14:43:36+05:30 IST