Share News

Article 370 Verdict: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN , First Publish Date - 2023-12-11T11:12:02+05:30 IST

ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Article 370 Verdict: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 307 రద్దుని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని సీజేఐ డీవై చంద్రచూడ్ వివరించారు. జమ్మూ కశ్మర్ భారతదేశంలో చేరినప్పుడు సార్వభౌమాధికారం లేదని, కేంద్రం తీసుకునే ప్రతి చర్యనూ సవాలు చేయకూడదని సీజేఐ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు తీర్పు వెలువరించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కేంద్రానికి రాష్ట్రం అనుమతి అవసరం లేదని సీజేఐ పేర్కొన్నారు. జమ్మూ, కాశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యమైన అంశాలు...

1. భారత యూనియన్‌లో చేరినప్పుడు జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదు: సీజేఐ

2. భారత రాజ్యాంగంలోని ప్రతి నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి అవసరం లేదు: సీజేఐ

3. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన. రాష్ట్రంలో యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు: సీజేఐ

4. జమ్మూకాశ్మీర్ కూడా అన్ని రాష్ట్రాల లాంటిదే. ఇతర రాష్ట్రాలకు విభిన్నంగా అంతర్గత సార్వభౌమాధికారం లేదు. ఈ మేరకు రాజ్యాంగంలో కూడా ప్రస్తావన లేదు: సీజేఐ

5. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్‌వ్యవస్థీకరించడం సమర్థనీయం: సీజేఐ

6. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చా? లేదా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు: సీజేఐ

7. ఆర్టికల్ 370 రద్దు సరైనదే. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు సమర్థనీయమే: సీజేఐ

8.ఆర్టికల్ 370 ముఖ్య ఉద్దేశ్యం జమ్మూ కాశ్మీర్‌ను నెమ్మదిగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా తీసుకురావడమే: జస్టిస్ కౌల్

9. డొంక దారిలో నిబంధనల సవరణ సరికాదు. ఒక విధానాన్ని సూచించినప్పుడు దానిని తప్పకుండా అనుసరించాలి: ఆర్టికల్ 367 ఉపయోగించి ఆర్టికల్ 370 సవరణ ప్రక్రియ చేపట్టడంపై జస్టిస్ కౌల్

10. ప్రభుత్వం ‘నిష్పాక్షిక నిజం, సయోధ్య కమిటీ’ని (The Truth and Reconciliation Commission) ఏర్పాటు చేయాలి. ఈ అంశంతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి: జస్టిస్ కౌల్ సిఫార్సు

ఇదిలావుండగా తీర్పు నేపథ్యంలో కశ్మీర్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తీర్పును రాజకీయం చేయవద్దంటూ బీజేపీ కోరింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ కూటమిగా జమ్ము-కశ్మీర్ పార్టీలు ఏర్పడ్డాయి. గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఏడాది ఆగస్ట్ 2 నుంచి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలు జమ్ము-కాశ్మీర్ రాజకీయ పార్టీలు సుప్రీంను ఆశ్రయించాయి.

Updated Date - 2023-12-11T12:14:21+05:30 IST