Akhilesh Yadav: ఎమ్మెల్యేలను కొనేస్తున్న బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పండి..
ABN , First Publish Date - 2023-09-03T17:48:28+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని ఘోసి అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ను గెలిపించాలని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్న బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.

లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘోసి (Ghosi) అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ను గెలిపించాలని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్న బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. ఆదివారం సాయంత్రంలో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈనెల 5న పోలింగ్ జరుగనుండగా, 8వ తేదీన ఫలితాలు వెలువడతాయి
బీజేపీ హయాంలో ధరల పెరుగుదల, అవినీతి, అకృత్యాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఘోసి ప్రజలు ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని, పార్టీలు మార్చే నేతలను తిప్పికొట్టాలని సమాజ్వాదీ పార్టీ ట్విటర్ ఖాతాలో అఖిలేష్ విజ్ఞప్తి చేశారు. ''గ్రూపులుగా వెళ్లి మీ ఓట్లు వేయండి. ఎవరి ఒత్తిళ్లకు లొంగకండి. ఎవరైనా ఒత్తిడి తెస్తే వెంటనే వీడియో తీసి మా పార్టీ కార్యకర్తలకు తెలియజేయండి. మీరు తప్పనిసరిగా ఓట్లు వేయండి. ఓట్లు చీలిపోకుండా చూసే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి'' అని ఆయన కోరారు. కౌంటింగ్ పూర్తయి విక్టరీ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే ఇళ్లకు తిరిగి వెళ్లాలని సూచించారు. ఈ విజయం సమాజ్వాదీ పార్టీదో, అభ్యర్థి సుధాకర్ సింగ్దో కాదని, ప్రజా విజయమని, సైకిల్ (పార్టీ గుర్తు) బటన్ నొక్కి మిమ్మల్ని మీరే విజేతగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'ఇండియా' కూటమి ఏర్పడిన తర్వాత తొలి ఎన్నిక ఇదే..
లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.) ఏర్పడిన తర్వాత యూపీలో జరుగుతున్న తొలి ఎన్నిక ఘోసి అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికే కావడం విశేషం. ఎస్పీ నేత దారా సింగ్ చౌహాన్ గత నెలలో పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. సమాజ్వాది పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించగా, బీఎస్పీ తమ అభ్యర్థిని బరిలోకి దింపలేదు.