Karnataka BJP: కర్ణాటకలో బీజేపీ బలంగా ఉండేందుకు కారణమైన వాళ్లపై నడ్డా ఫోకస్.. ఇంతకీ వాళ్లెవరంటే..

ABN , First Publish Date - 2023-02-26T12:52:15+05:30 IST

నాలుగు దశాబ్దాల పాటు కర్ణాటకలో బీజేపీకి చుక్కానిలా వ్యవహరించిన కీలక నేత, మాజీ సీఎం యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత వస్తున్న..

Karnataka BJP: కర్ణాటకలో బీజేపీ బలంగా ఉండేందుకు కారణమైన వాళ్లపై నడ్డా ఫోకస్.. ఇంతకీ వాళ్లెవరంటే..

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాల పాటు కర్ణాటకలో బీజేపీకి (Karnataka BJP) చుక్కానిలా వ్యవహరించిన కీలక నేత, మాజీ సీఎం యడియూరప్ప (Ex CM Yediyurappa) ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత వస్తున్న శాసనసభ సమరంలో నెగ్గేందుకు పార్టీ అధిష్టానం కాషాయం కారిడార్‌కు సిద్ధం చేస్తోంది. కర్ణాటకలో బీజేపీ బలంగా ఉండేందుకు పలు మఠాధిపతులు కూడా కారణమే. రాష్ట్రంలో ఎక్కువ జనాభా కల్గిన కులాలకు అనుబంధంగా ఉండే మఠాధిపతులను కలిసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిద్ధమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు మఠాధిపతులను భేటీ కావడం రాజకీయ అంశాలపై చర్చించడం కుతూహలం రేకెత్తిస్తోంది. కాషాయ రాజకీయంతోనే దినదినాభివృద్ధి చెందిన బీజేపీ అదే మార్గంలోనే రాష్ట్ర ఎన్నికల్లోనూ మరిన్ని వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

దేశమంతటా హిందుత్వ అజెండా పనిచేసినంతగా రాష్ట్రంలో సాధ్యం కాదని అంచనా వేసిన పార్టీ వర్గాలు కులాల ప్రాతిపదకన కొనసాగుతున్న మఠాధిపతులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. గడిచిన నాలుగు దశాబ్దాల ఎన్నికల్లోనూ బీజేపీ యడియూరప్పను ముందు పెట్టుకునే ప్రజాబలాన్ని పొందింది. ప్రారంభంలో రైతు నాయకుడిగా అన్ని వర్గాలు ఆయనకు మద్దతు పలికాయి. ఆయన వర్ఛస్సుతోనే దశాబ్దన్నర వ్యవధిలో ఓసారి సంకీర్ణంతోనూ, రెండుసార్లు బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మారిన రాజకీయాల నేపథ్యంలో యడియూరప్పతోపాటు సమష్టి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని చెబుతున్నా సంపూర్ణంగా సాధ్యం కావడం లేదనే అధిష్టానం ఆలోచిస్తోంది. అందుకోసమే మఠాధిపతుల చెంతకు నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు వెళ్తున్నారు. పంచమశాలి, కురుబ, వాల్మీకి, బోవి, మాదార కులాలకు చెందిన మఠాధిపతులను నడ్డా కలిశారు. కొన్ని వర్గాలకు చెందిన స్వామిజీలను రాజకీయాల్లోకి ఆహ్వానించారు.

యోగి మోడల్‌ పైనా కసరత్తు

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అక్కడ ప్రజాబలాన్ని పార్టీ పొందేందుకు పలు వ్యూహాలు అమలు చేసింది. అదే రీతిలోనే పలు కులాల స్వామిజీలనూ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోని సదరు సామాజిక వర్గానికి చెందిన ప్రజల మద్దతు సాధ్యమని భావిస్తున్నారు. జనాభా ఆధారంగా అయితే పంచమశాలి, కురుబ, వాల్మీకి, మాదార, బోవి సామాజిక వర్గాలు ప్రముఖమైనవి. ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కులాలు ప్రముఖంగా ఉన్నాయి. పంచమశాలి లింగాయత వర్గానికి చెందినవారు ఉత్తర కర్ణాటకలో బలమైనవారు. సదరు కులాలకు చెందిన స్వామిజీలను మరో నెలరోజుల్లోనే పార్టీ వైపు మళ్లించుకునేందుకు మరిన్ని భేటీలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు.

యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యేందుకు పలు వెనుకబడిన సామాజిక వర్గాలు పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. ఎస్టీ కేటగిరీలో ఉండే వాల్మీకి సామాజిక వర్గంలో బీజేపీకి చెందిన మంత్రి శ్రీరాములు, బోవి సామాజిక వర్గానికి చెందిన అరవింద లింబావళి వంటి కీలకులు ఉన్నారు. బీసీ వర్గాల్లోని ఇతర కులాలకు చెందిన మఠాధిపతులను కమలం వైపు తిప్పుకునేందుకు ఏమేరకు కసరత్తు సాగుతుందనేది గమనించాల్సిందే. అయితే కురుబ సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేత సిద్దరామయ్య కాంగ్రెస్‏లో కీలకులు. ఆ సామాజికవర్గానికి చెందినవారు బీజేపీవైపు ఏమేరకు మొగ్గు చూపుతారనేది వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2023-02-26T16:19:08+05:30 IST