BJP vs I.N.D.I.A : ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత బీజేపీదే : నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2023-08-19T12:33:18+05:30 IST

రానున్న లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, జేడీయూ, డీఎంకే వంటి 26 పార్టీలు ఇండియా (I.N.D.I.A) కూటమిగా ఏర్పడ్డాయని, ఈ పార్టీలన్నీ ఏకమయ్యేలా చేసిన ఘనత బీజేపీదేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

BJP vs I.N.D.I.A : ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత బీజేపీదే : నితిన్ గడ్కరీ
Nitin Gadkari

న్యూఢిల్లీ : రానున్న లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, జేడీయూ, డీఎంకే వంటి 26 పార్టీలు ఇండియా (I.N.D.I.A) కూటమిగా ఏర్పడ్డాయని, ఈ పార్టీలన్నీ ఏకమయ్యేలా చేసిన ఘనత బీజేపీదేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘ఆజ్ తక్ జీ20 సదస్సు’లో శనివారం ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం చెప్తూ, ప్రతిపక్షాల ఐక్యతకు రూపశిల్పి బీజేపీయేనని చెప్పారు. సిద్ధాంతాలు కలవనివారు, ఒకరి ముఖం మరొకరు చూసుకొననివారు, కలిసి కూర్చుని తేనీరు సేవించనివారు ఇప్పుడు బీజేపీపై పోరాడటానికి వచ్చారన్నారు.

కశ్మీరు నుంచి కన్యా కుమారికి ఎక్స్‌ప్రెస్‌వే

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, కశ్మీరును కన్యా కుమారితో అనుసంధానం చేయడం కోసం ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తామని తెలిపారు. యాక్సెస్ కంట్రోల్ రోడ్ ద్వారా ఈ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.


ద్వారక ఎక్స్‌ప్రెస్‌వేపై ఆడిట్ నివేదిక

ద్వారక ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించడానికి మితిమీరిన ఖర్చు చేస్తున్నారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించడంపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఈ నివేదికలో చెప్పినట్లుగా ఈ మార్గం పొడవు 29 కిలోమీటర్లు కాదని, అది 230 కిలోమీటర్ల పొడవైన మార్గమని చెప్పారు. దీనిలో సొరంగాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్క కిలోమీటరుకు రూ.9.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ విషయాన్ని తాను కాగ్ అధికారులకు వివరించానని చెప్పారు. అయినప్పటికీ ఈ నివేదికను రూపొందించారన్నారు.

కాగ్ నివేదిక ప్రకారం, ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 29.06 కిలోమీటర్లు. ఒక్కొక్క కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.250.77 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ ఒక్కొక్క కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.18.2 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అత్యధిక ఖర్చుతో రోడ్డును నిర్మిస్తున్నారని ఈ నివేదిక ఆరోపించింది. ఈ ఆరోపణలను నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు.


ఇవి కూడా చదవండి :

Udyan Express : ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం..

Evil Nurse : ఏడుగురు పసికందులను చంపేసిన నర్స్.. భారత సంతతి డాక్టర్ కృషితో ఆ రాక్షసికి శిక్ష..

Updated Date - 2023-08-19T12:33:18+05:30 IST