Chennai: మణిపూర్‌ హింసలో అన్నీ కోల్పోయాం...

ABN , First Publish Date - 2023-07-29T08:59:59+05:30 IST

మణిపూర్‌(Manipur) రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆందోళనకారులు ఇంటికి నిప్పంటించడంతో సర్వం కోల్పోయి చెన్నైకి తిరిగివచ్చామ

Chennai: మణిపూర్‌ హింసలో అన్నీ కోల్పోయాం...

- సీఎంకు ఓ తమిళ కుటుంబం వినతి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మణిపూర్‌(Manipur) రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆందోళనకారులు ఇంటికి నిప్పంటించడంతో సర్వం కోల్పోయి చెన్నైకి తిరిగివచ్చామని ఇటీవల ఆ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో నగరానికి చేరుకున్న జోసెఫ్‌, ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సచివాలయం వద్ద సీఎం సెల్‌కు వినతిపత్రం సమర్పించేందుకు జోసెఫ్‌ కుటుంబ సభ్యులతో వచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొన్నేళ్ల క్రితం తాను మణిపూర్‌కు వెళ్ళి సుగుణు అనే ప్రాంతంలో బస చేస్తూ వ్యాపారం చేసుకుంటూ బతుకుతుండేవాడినన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయానని తెలిపారు. తనకు భార్య, ఐదుగురు పిల్లలు, కోడలు, మనవలు అంటూ మొత్తం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులున్నారని చెప్పారు. నెల రోజులకు ముందు మణిపూర్‌లో జరిగిన అల్లర్లలో తమ ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టి, అందరినీ తరిమికొట్టారన్నారు. ఇల్లు, వాహనాలు, దుస్తులు, నగదు, నగలు అన్నీ మంటల్లో కాలిబూడిదయ్యాయని, కట్టుబట్టలతో తామంతా ఆకలి దప్పులతో అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ అసోంలోని గౌహతి(Guwahati)కి చేరుకుని అక్కడి తమిళుల సాయంతో చెన్నైకి తిరిగొచ్చామన్నారు. స్థానిక ప్రముఖుడొకరు రెడ్‌హిల్స్‌లో తమ కుటుంబానికి ఆశ్రయం కల్పించారని, మూడు రోజులుగా అక్కడే ఉంటున్నామని జోసెఫ్‌ తెలిపారు. మణిపూర్‌ హింసాకాండలో సర్వం కోల్పోయి స్వస్థలానికి తిరిగొచ్చిన తనను, కుటుంబీకులను ఆదుకోవాలని ఆయన సీఎం స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-07-29T08:59:59+05:30 IST