Sanatan Dharma: సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే ఇండియా కూటమి లక్ష్యం.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-14T21:03:03+05:30 IST

‘సనాతన ధర్యం’పై డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి సంబంధం లేదని.. ఆ కూటమిలోని ప్రధాన నేతలు ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఉదయనిధి చేసిన..

Sanatan Dharma: సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే ఇండియా కూటమి లక్ష్యం.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

‘సనాతన ధర్యం’పై డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి సంబంధం లేదని.. ఆ కూటమిలోని ప్రధాన నేతలు ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, అన్ని మతాలను గౌరవించాలంటూ తమదైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయినా సరే.. బీజేపీ మాత్రం ఈ ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే ఇండియా కూటమి లక్ష్యమంటూ.. ఈ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడుతోంది.


ఈ ప్రయత్నాల్లో భాగంగానే.. తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇండియా కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడం, మీడియాను బెదిరించడమే ‘ఇండియా’ కూటమి లక్ష్యమంటూ ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలం నాటి ఆలోచన.. ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీల్లో సజీవంగా ఉందని పేర్కొన్నారు. ఇండియా కూటమి తన చేష్టల్ని ఆపాల్ని.. దాని బదులుగా నిర్మాణాత్మక పనులు, ప్రజలకు సేవ చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. లేకపోతే.. మరింత మరుగున పడతారంటూ హెచ్చరించారు. ఇండియా కూటమికి చెందిన సమన్వయ కమిటీ ఏయే యాంకర్ల షోలను నిరోధించాలన్న విషయంపై సబ్-గ్రూప్‌కు ఆదేశాలు జారీ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. జేపీ నడ్డా ఇలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో ఇండియా కూటమి కేవలం రెండు పనులే చేస్తోంది. ఒకటి.. సనాతన ధర్మాన్ని తిట్టడం, రెండోది.. మీడియాను తిట్టడం. నాజీల తరహాలో.. జర్నలిస్టులను టార్గెట్ చేసుకొని బెదిరింపులకు పాల్పడుతోంది’’ అని చెప్పారు. గతంలోనూ పండిట్ నెహ్రూ వాక్ స్వాతంత్రానికి సంకెళ్లు వేశారని, తనని విమర్శించిన వారిని అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. ఈ అంశంపై ఇందిరాగాంధీ గోల్డ్ మెడల్ సాధించారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ సైతం మీడియాను రాజ్య నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-14T21:03:03+05:30 IST