India-Bharat : ఇండియా, భారత్ పేరు వివాదం.. రాహుల్ గాంధీ ఘాటు స్పందన..

ABN , First Publish Date - 2023-09-08T16:10:31+05:30 IST

ఇండియా-భారత్ వివాదంలో ప్రభుత్వ భయాందోళన కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంలో ‘ఇండియా, అంటే భారత్’ అని ఉందని, అది తనకు పూర్తిగా సంతృప్తికరమేనని చెప్పారు.

India-Bharat : ఇండియా, భారత్ పేరు వివాదం.. రాహుల్ గాంధీ ఘాటు స్పందన..
Rahul Gandhi

బ్రసెల్స్ : ఇండియా-భారత్ వివాదంలో ప్రభుత్వ భయాందోళన కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంలో ‘ఇండియా, అంటే భారత్’ అని ఉందని, అది తనకు పూర్తిగా సంతృప్తికరమేనని చెప్పారు. ఈ వివాదంపై వస్తున్న స్పందనలన్నీ విస్మయంతోకూడినవేనని చెప్పారు. ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టడం అద్భుతమైన ఆలోచన అని తెలిపారు.

యూరోప్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బ్రసెల్స్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, ‘‘రాజ్యాంగంలో ఉన్న ఇండియా, అంటే భారత్ పేరు నాకు సంతృప్తికరమే. అది నాకు చాలా బాగుంది. ఇవన్నీ భయాందోళనతో కూడిన ప్రతిస్పందనలు. ప్రభుత్వంలో కాస్త భయం ఉంది. ఇవన్నీ పక్కదారి పట్టించే ప్రయత్నాలు. మేం ఇండియా అని మా కూటమికి పేరు పెట్టాం. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. మేం ఎవరిమో ఇది తెలియజేస్తుంది. ఇండియా గళంగా మమ్మల్ని మేం భావిస్తాం. కాబట్టి ఈ పేరు బాగుంటుంది’’ అని చెప్పారు. అయితే ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బాగా కలవరపెట్టిందని, ఆయన ఏకంగా దేశం పేరునే మార్చాలని కోరుకుంటున్నారని చెప్పారు.

అదానీ, క్రోనీకేపిటలిజం అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతిసారీ మోదీ నాటకీయంగా సరికొత్త దారి మళ్లింపు ప్రయత్నం చేస్తారన్నారు. తాను అదానీ గురించి విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలను ప్రారంభించారన్నారు. ఇదంతా ఆసక్తికరంగా ఉందన్నారు.

మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంకేతాలను ఇవ్వలేదు. అయితే జీ20 సదస్సుకు హాజరవుతున్న వివిధ దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇస్తున్నారు. శనివారం రాత్రి జరిగే ఈ విందు కోసం పంపించిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. అదే విధంగా ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ముద్రించిన నోట్‌లో కూడా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్, టీఎంసీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఘాటుగా స్పందించాయి.


ఇవి కూడా చదవండి :

నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం

Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-09-08T16:10:31+05:30 IST