Share News

Terror Attack: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. IEDని ధ్వంసం చేసిన భారత సైన్యం

ABN , Publish Date - Dec 27 , 2023 | 05:12 PM

భారత సైన్యం బుధవారం (27/12/23) జమ్ముకశ్మీర్‌లో ఒక భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని (భారీ పేలుడు పదార్థాలు) స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఇండియన్ ఆర్మీకి...

Terror Attack: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. IEDని ధ్వంసం చేసిన భారత సైన్యం

Jammu Kashmir: భారత సైన్యం బుధవారం (27/12/23) జమ్ముకశ్మీర్‌లో ఒక భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని (భారీ పేలుడు పదార్థాలు) స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన ‘చినార్ కార్ప్స్’ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. ‘‘శ్రీనగర్-బారాముల్లా హైవేపై లావేపురా సమీపంలో ఐఈడీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. చినార్ కార్ప్స్, జమ్ముకశ్మీర్ పోలీసులు ఒక పెద్ద ఉగ్రవాద సంఘటన జరగకుండా నిరోధించారు. ఆ ఐఈడీని లవేపురాలోనే ధ్వంసం చేశారు. కశ్మీర్‌ను ఉగ్రవాద రహితంగా మలిచేందుకు భారత సైతం నిశ్చయించుకుంది, ఆ దిశగా దూసుకెళ్తోంది’’ అని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.

కొంతకాలం నుంచి ఉగ్రవాదులు భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే.. హైవేలు, రోడ్లపై IEDలను అమర్చుతున్నట్టు తెలిసింది. మెరుపుదాడులు కూడా ప్రారంభించారు. శీతాకాలం రావడంతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల పూంచ్‌లో ఉగ్రవాదులు భారత సైన్యంపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల్ని వేటాడటం మొదలుపెట్టింది. ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ గురించి తెలుసుకోగలిగారు. ఈ ఐఈడీలు భారత సైన్యానికి గ్యాస్ సిలిండర్ల రూపంలో లభ్యమయ్యాయని సమాచారం.


పీటీఐ వార్తా సంస్థ ప్రకారం.. బుధవారం ఉదయం భద్రతా దళాలు పెట్రోలింగ్ చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమయంలో శ్రీనగర్-బారాముల్లా హైవేపై లావేపురా వద్ద గ్యాస్ సిలిండర్ అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని చూశారని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే ట్రాఫిక్ మార్గాన్ని మార్చడం జరిగిందని అన్నారు. అనంతరం బాంబు నిర్వీర్య విభాగానికి సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. బాంబు స్క్వాడ్ ఆ ఐఈడీని నిర్వీర్యం చేసి, ఒక పెద్ద ప్రమాదాన్ని నిరోధించిందని అధికారులు వెల్లడించారు. ఐఈడీని నిర్వీర్యం చేసిన అనంతరం పరిస్థితుల్ని సమీక్షించి.. రోడ్డుపై రాకపోకల్ని పునరుద్ధరించడం జరిగిందని అధికారులు చెప్పారు.

కాగా.. నవంబర్‌లో కూడా ఇలాంటి భారీ ఉగ్రకుట్రనే భారత సైతం భగ్నం చేసింది. జమ్మూలోని నర్వాల్-సిధ్రా హైవేపై టిఫిన్ బాక్స్‌లో అమర్చిన 2 కిలోల బరువున్న టైమర్ ఆధారిత ఐఈడీని జమ్ముకశ్మీర్ పోలీసులు కనుగొన్నారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పోలీసు పోస్టు సమీపంలోని రోడ్డుపై అనుమానాస్పద వస్తువు పడి ఉండటంపై అధికారులకు సమాచారం అందింది. అప్పుడు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు పోలీసు బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, బాంబును అక్కడి నుంచి తొలగించారు.

Updated Date - Dec 27 , 2023 | 05:51 PM