Priyanka Gandhi : ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-08-13T13:22:42+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలు 50 శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

Priyanka Gandhi : ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు.. ఎందుకంటే..

ఇండోర్ : మధ్య ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలు 50 శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత నిమేష్ పాఠక్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్‌నాథ్, అరుణ్ యాదవ్ శుక్రవారం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఇచ్చిన ట్వీట్లలో రాష్ట్రంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్లను 50 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని జ్ఞానేంద్ర అవస్తి రాసినట్లు చెప్తున్న లేఖ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్ల యూనియన్ ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాసిందని తెలిపారు. తమకు రావలసిన సొమ్మును 50 శాతం కమిషన్ చెల్లించిన తర్వాత మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపిందని చెప్పారు.

ప్రియాంక ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కర్ణాటకలోని అవినీతి బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమిషన్ వసూలు చేస్తూ ఉండేది. మధ్య ప్రదేశ్‌లో, బీజేపీ అవినీతిలో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు గద్దె దించారు. ఇక మధ్య ప్రదేశ్ ప్రజలు 50 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తారు’’ అని పేర్కొన్నారు.

ఇదే తరహాలో కమల్‌నాథ్, అరుణ్ యాదవ్ కూడా ట్వీట్లు చేశారు. దీనిపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ స్పందిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ, ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ప్రియాంకను కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఇండోర్ పోలీసులు ట్విటర్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ నేతల ట్వీట్లపై బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ నిమేష్ పాఠక్ ఫిర్యాదు చేశారు. జ్ఞానేంద్ర అవస్తి రాసినట్లు చెప్తున్న లేఖ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 శాతం కమిషన్ చెల్లించాలని కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తున్నారని ఈ లేఖలో ఆరోపించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు బీజేపీ కీర్తిప్రతిష్ఠలను భంగపరచడం కోసం కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నారని పాఠక్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అవస్థిపైనా, ప్రియాంక, కమల్‌నాథ్, అరుణ్ యాదవ్‌ల ఎక్స్ ఖాతాల హ్యాండ్లర్స్‌పైనా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రామసనేహి మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, ప్రియాంక, కమల్‌నాథ్, అరుణ్ యాదవ్‌ల ఎక్స్ ఖాతాల హ్యాండ్లర్స్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నగరంలోని సంయోగిత గంజ్ పోలీస్ స్టేషన్‌లో మోసం, ఫోర్జరీ ఆరోపణలపై ఈ కేసు నమోదైనట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్

Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

Updated Date - 2023-08-13T14:15:32+05:30 IST