NCB : భారీగా మాదక ద్రవ్యాల స్వాధీనం : ఎన్‌సీబీ

ABN , First Publish Date - 2023-06-06T15:25:57+05:30 IST

దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌ గుట్టును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రట్టు చేసింది. సింథటిక్ రసాయనాల

NCB : భారీగా మాదక ద్రవ్యాల స్వాధీనం : ఎన్‌సీబీ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌ గుట్టును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రట్టు చేసింది. సింథటిక్ రసాయనాల ఆధారిత మాదక ద్రవ్యాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసింది. వీరు క్రిప్టోకరెన్సీతో డార్క్ వెబ్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని గుర్తించింది.

ఎన్‌సీబీ విడుదల చేసిన ప్రకటనలో లైసెర్జిక్ యాసిడ్ డైతైలమైడ్ (LSD) 15,000 బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, ఒకే ఒక ఆపరేషన్‌లో ఇంత భారీ స్థాయిలో ఎల్ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. వీరు డార్క్ నెట్ ద్వారా క్రిప్టో వాలెట్స్, క్రిప్టోకరెన్సీలను ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నారన్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య భౌతిక సంబంధాలు ఉండవని చెప్పారు.

డార్క్ వెబ్ లేదా డార్క్ నెట్‌ను రహస్య కార్యకలాపాలకు వినియోగిస్తారు. చట్టవిరుద్ధ వస్తువులను అమ్మడానికి, నిషిద్ధ కంటెంట్‌ను ఇచ్చి, పుచ్చుకోవడానికి, ఇతర క్రిమినల్ చర్యల్లో పాలుపంచుకోవడానికి దీనిని వాడతారు. పట్టుబడిన నెట్‌వర్క్ అమెరికా, పోలండ్, నెదర్లాండ్స్, భారత దేశంలలో విస్తరించిందని ఎన్‌సీబీ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో 2.5 కేజీల మారిజువానాను, రూ.24.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఎల్ఎస్‌డీని 0.1 గ్రాము కన్నా ఎక్కువగా కలిగియుండటం చట్ట ప్రకారం నేరం. దోషులను మాదక ద్రవ్యాలు, ఉన్మత్త పదార్థాల చట్టం (NDPS) ప్రకారం శిక్షిస్తారు. ఇది హయ్యర్ గ్రేడ్ మాదక ద్రవ్యం కాబట్టి దీని విలువ కూడా ఎక్కువేనని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఒక కేజీ పొట్లాల రూపంలో రహస్యంగా దాచి ఉంచారని చెప్పారు.

ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఆర్థికంగా చూసినపుడు ప్రస్తుతం పట్టుబడిన మాదక ద్రవ్యం చాలా ఎక్కువ అని చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఇరాన్‌లోని చాబహార్ పోర్టు గుండా ఈ మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ జాతీయుడు జుబెయిర్ నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. పాకిస్థాన్‌లోని ట్రాఫికర్ తనకు పెద్ద మొత్తంలో సొమ్మును ఆశచూపించడంతో తాను ఈ నేరానికి పాల్పడినట్లు స్వచ్ఛందంగా అంగీకరించాడని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..

America : భారత్ శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశం : అమెరికా

Updated Date - 2023-06-06T15:25:57+05:30 IST