Nirmala Sitaraman: ఉదయనిధి స్టాలిన్ అలా అనుకుంటే, అది తప్పే అవుతుంది.. నిర్మలా సీతారామన్ పరోక్ష హెచ్చరిక

ABN , First Publish Date - 2023-09-16T21:52:10+05:30 IST

సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా స్పందించారు. ఉదయనిధి ఏదైనా మాట్లాడటానికి ముందు..

Nirmala Sitaraman: ఉదయనిధి స్టాలిన్ అలా అనుకుంటే, అది తప్పే అవుతుంది.. నిర్మలా సీతారామన్ పరోక్ష హెచ్చరిక

సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా స్పందించారు. ఉదయనిధి ఏదైనా మాట్లాడటానికి ముందు.. రాష్ట్ర మంత్రిగా తన బాధ్యతను గ్రహించి మాట్లాడాలని ఆమె సూచించారు. 1971లో తమిళనాడులో శ్రీరాముడిని అవమానించినప్పటికీ.. సనాతన ధర్మం హింసాత్మకంగా రియాక్ట్ అవ్వలేదని ఆమె గుర్తు చేశారు. సనాతన ధర్మంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఎలాంటి రియాక్షన్ రాకూడదని ఉదయనిధి భావిస్తే.. అది ముమ్మాటికీ తప్పని పరోక్షంగా హెచ్చరించారు. మంత్రి ఉదయనిధి ఈ సనాతన ధర్మంపై చర్చను స్టార్ట్ చేశారని.. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ చర్చకు తెరతీశారా? అని ఆమె ప్రశ్నించారు.


రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే.. బీజేపీ సనాతన ధర్మం చర్చల్లో పాల్గొంటోందని ఇటీవల విడుదలై చిరుతైగల్ కట్చి నాయకుడు తోల్ తిరుమావళవన్ విమర్శలు గుప్పించారు. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘మేము ఈ చర్చలను ప్రారంభించలేదు, మీరే దీనిని స్టార్ట్ చేశారు’’ అని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని.. అయితే ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని ఆమె అన్నారు. హింసను ప్రేరేపించే పదాలు ఉపయోగించడం తప్పన్నారు. స్వాతంత్ర్యం తరువాత దేశం రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి.. హింసను ప్రేరేపించే భాషను ఉపయోగించకుండా ఉండాల్సిన బాధ్యత మనందరిది ఉందన్నారు. సనాతన ధర్మంపై తమ పార్టీ 100 ఏళ్ల పాటు మాట్లాడుతుందని ఉదయనిధి చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. మీరు మాట్లాలనుకుంటే మాట్లాడండి కానీ, హింసను ప్రేరేపించే విధంగా ఎవరూ మాట్లాడకూడదని ఆమె నొక్కి వక్కాణించారు.

రాముడి చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగింపు నిర్వహించే తమిళనాడులో తాను పెరిగానని.. ఇప్పటికీ ఆ సంఘటనని గుర్తు చేసుకుంటే ఎంతో బాధగా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కంటికి కన్ను, పన్నుకి పన్ను లాంటి విధానాన్ని తాము అమలు చేయలేదని.. ఇదే సనాతన ధర్మమని ఆమె తెలిపారు. ఒకవేళ ఇతర మతస్థులను లక్ష్యంగా చేసుకొని అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటే.. దేశవ్యాప్తంగా ఏం జరిగి ఉండేదో అందరికీ తెలుసని పేర్కొన్నారు. కాగా.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిందని.. దీనిని వ్యతిరేకించడమే కాదు, పూర్తిగా నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.

Updated Date - 2023-09-16T21:52:10+05:30 IST