Nitish Kumar: జర్నలిస్టులకు నా మద్దతు ఉంటుంది.. న్యూస్ యాంకర్లపై ఇండియా కూటమి బహిష్కరణ తర్వాత షాకిచ్చిన నితీష్ కుమార్

ABN , First Publish Date - 2023-09-16T22:18:18+05:30 IST

సొంత పార్టీ లేదా కూటమి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు.. అందరూ దానికి కట్టుబడి ఉంటారు. ఏ ఒక్కరూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయరు. కానీ.. ఇండియా కూటమిలో కీలక నేతగా...

Nitish Kumar: జర్నలిస్టులకు నా మద్దతు ఉంటుంది.. న్యూస్ యాంకర్లపై ఇండియా కూటమి బహిష్కరణ తర్వాత షాకిచ్చిన నితీష్ కుమార్

సొంత పార్టీ లేదా కూటమి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు.. అందరూ దానికి కట్టుబడి ఉంటారు. ఏ ఒక్కరూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయరు. కానీ.. ఇండియా కూటమిలో కీలక నేతగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం, తన కూటమి తీసుకున్న నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేసి అందరికీ షాకిచ్చారు. జర్నలిస్టులకు తన మద్దతు ఉంటుందని, ప్రతి ఒక్కరికీ తమకంటూ హక్కులు ఉంటాయని అన్నారు. 14 మంది న్యూస్ యాంకర్లను బహిస్కరిస్తున్నట్టు ఇండియా కూటమి ప్రకటించిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఇండియా కూటమి న్యూస్ యాంకర్లను బహిష్కరించడం గురించి తనకేమీ తెలియదంటూ కుండబద్దలు కొట్టారు.


శనివారం నితీశ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా కూటమి న్యూస్ యాంకర్లను బహిష్కరించిందన్న విషయంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. అయితే.. నేను జర్నలిస్టులకు మద్దతు ఇస్తాను. పూర్తి స్వేచ్ఛ లభించినప్పుడే జర్నలిస్టులు తమకు నచ్చినవి రాస్తారు. వాళ్లు ఎవరి అదుపులోనైనా ఉన్నారా? నేను ఎప్పుడైనా వారిని అదుపు చేశానా? జర్నలిస్టులకు తమకంటూ హక్కులున్నాయి. అయితే.. నేను ఎవ్వరినీ వ్యతిరేకించడం లేదు’’ అని చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న వాళ్లు కొంతమందిని అదుపు చేస్తున్నారని.. ఇండియా కూటమిలో ఉన్న వాళ్లు కూడా ఏదో జరుగుతోందని భావించి ఉంటారని, అందుకే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని చెప్పారు. అయితే.. తాను మాత్రం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.

ఇదిలావుండగా.. గురువారం ఇండియా కూటమి 14 మంది న్యూస్ యాంకర్లను బహిష్కరిస్తున్నట్టు ఒక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాని రిలీజ్ చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. ‘‘మీరు మా నేతలకు వ్యతిరేకంగా హెడ్‌లైన్స్ వేస్తారు. వారి ప్రసంగాలను ట్విస్ట్ చేస్తారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తారు. దీనిపై మేము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. సమాజంలో అల్లర్లకు దారి తీసే విద్వేషాల్ని మీరు వ్యాప్తి చేస్తే.. అందులో మేము భాగం కావాలనుకోవడం లేదు’’ అని చెప్పారు. అయితే.. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్‌బీడీఏ) ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపింది. అటు.. బీజేపీ సైతం ఈ నిర్ణయాన్ని ఎమర్జెన్సీతో పోల్చింది.

Updated Date - 2023-09-16T22:18:18+05:30 IST