Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2023-09-22T15:21:45+05:30 IST

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నోటీసులు పంపింది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో ఉదయనిధి ఇటీవల పోల్చారు. సామాజిక ధర్మానికి సనాతన ధర్మం వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని అన్నారు.

Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: సనాతన ధర్మం (Sanatan Dharma)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు నోటీసులు పంపింది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో ఉదయనిధి ఇటీవల పోల్చారు. సామాజిక ధర్మానికి సనాతన ధర్మం వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. పలు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఉదయనిధితో పాటు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


హైకోర్టుకు వెళ్లొచ్చు..

జస్టిస్ అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేస్తూ, వ్యాఖ్యలు చేసిన జ్యురిస్‌డిక్షనల్ హైకోర్టును పిటిషనర్ ఆశ్రయించే ఆప్షన్ ఉందన్నారు. ''ఇక్కడే (సుప్రీంకోర్టు) పిటిషన్ ఎందుకు? మీరు హైకోర్టుకు వెళ్లండి. మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కోర్టును కోరారు. అత్యున్నత న్యాయస్థానాన్ని పోలీస్ స్టేషన్‌గా మారుస్తున్నట్టు కనిపిస్తోంది. పిటిషన్ అభ్యర్థనపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు కూడా ఉంది'' అని బెంచ్ పేర్కొంది. దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ కోర్టుకు వివరణ ఇస్తూ, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.


కాగా, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, పర్యవసనాలను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అన్నారు.

Updated Date - 2023-09-22T15:21:45+05:30 IST